ప్రజాశక్తి – వినుకొండ : సిఎం చంద్రబాబుని వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మంగళవారం కలిశారు. చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జీవీ ఆంజనేయులు విలేకర్లతో మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. న్యాయవా దులను వెంట తీసుకుని వెళ్లి వినుకొండలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు, నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు కేటాయించాలని, ఓల్టేజీ సమస్య ప్రాంతాల్లో విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఉపాధి హామీ పథకం పెండింగ్ బకాయిలు విడుదల, ఈపూరు, దొండపాడు ఎన్ఎస్పి కాల్వలపై తూములు ఏర్పాటు చేసి ఈపూరు, దొండపాడు చెరువులకు నీరు సరఫరా చేసేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
