ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యాప్తంగా పుస్తక వారోత్సవాలను నిర్వహిస్తోంది. బుధవారం అంతర్జాతీయ పుస్తక దినోత్సవం మొదలుకొని ఈనెల 30 శ్రీశ్రీ జయంతి వరకు ఈవారోత్సవాలు కొనసాగుతాయి. స్థానిక గురజాడ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని పూర్వ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొంగలి పోతన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు తిరిగి చదివే అలవాటును ప్రజల్లోకి తీసుకెళ్లడం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు ఉపయోగపడే అనేక పుస్తకాల పఠనంపై ఆసక్తిని కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెవివి నాయకులు తెలిపారు. విజ్ఞాన వేదిక చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరినీ కోరారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ చీకటి దివాకర్ పుస్తక పఠనం ఏ విధంగా మహామహులను తీర్చిదిద్దిందో వివరిస్తూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. జెవివి జిల్లా కార్యదర్శి రమణ్ ప్రభాత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వి. రాజగోపాల్, రమణ్ ప్రభాత్, శశిధర్, జి.నిర్మల, సింహాచలం పాల్గొన్నారు.
బొబ్బిలి: ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని స్ధానిక గ్రంథాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లైబ్రేరియన్ స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి పుస్తకం ఆవిర్భావ చారిత్రక పరిణామాన్ని వివరించారు. మానవ మనుగడ, చరిత్ర, శాస్త్రంనకు ఆధారాలు పుస్తకాలే అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా బుక్ మాత్రమే కీలకమైందని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ శ్రీరామమూర్తి, శ్రీనివాస్, చిట్టిబాబు పాల్గొని ప్రస్తుత సమాజంలో పుస్తకాల ఆవశ్యకతను వివరించారు. విద్యార్ధులకు, పాఠకులకు సంబంధించిన పుస్తకాలను గ్రంథాలయానికి విజయ గౌరి అందజేశారు.
ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం
తెర్లాం: స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పుస్తక దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంఇఒ జాన త్రినాథరావు విద్యార్థులు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, సిఆర్పి సర్వేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.