ప్రజాశక్తి-అట్లూరు: అట్లూరు నందు ఆదివారం కేంద్ర బడ్జెట్ 2025-2026 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ పత్రాలను సిపిఎం ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి, చాంద్ భాష , అట్లూరు మండల కార్యదర్శి ఇ, రమణ లు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ గురించి చదివి వినిపించారు. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే గతంలో 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఏడు లక్షల కోట్ల రూపాయలకు సవరించారు. ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలంటే..గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బడ్జెట్ ఐదు శాతం పెరిగింది. ప్రతి పద్దుకూ ఐదు శాతం కేటాయింపులు పెరిగితే..పోయిన సారి కేటాయింపులతో సమానంగా ఉంటుంది. ఉత్పత్తి రంగాలైన గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కార్మికులు, పట్టణ ప్రాంతాల్లోని అసంఘటిత కార్మికులు, సామాజికంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఓబీసీలు, మహిళలు ఎలా ఉన్నారు అని వారి స్థితి గతులు అధ్యయనం చేసి బడ్జెట్ కేటాయింపులు చేసి ఉంటే బాగుండేది అని అన్నారు. ఉపాధి హామీకి గత బడ్జెట్లో రూ.86 వేల కోట్లు ఇచ్చారు. సవరించిన దాంట్లో 86 వేల కోట్లే..ఇప్పుడు కూడా 86 వేల కోట్ల రూపాయలే. ఐదు శాతం పెంచాలంటే సుమారు రూ.90 వేల కోట్లు ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టానికి కనీసం రూ.2.5 లక్షల కోట్లు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి. ఉపాధి హామీ అంటే ప్రధాని నరేంద్ర మోడీకి అంబానీ, అదానీ, కార్పొరేట్లకు ఉపాధి కల్పించడం. పేదరికాన్ని నిర్మూలిస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు. ఆహారభద్రతకు ఎక్కువ నిధులు కేటాయించాలి. 24 కోట్ల రేషన్ కార్డుల్లో 84 కోట్ల మంది ఆహార భద్రత మీద ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో రూ.2.70 లక్షల కోట్లు ఇచ్చారు. మోడీ ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వస్తుంది, రూ.2.03 లక్షల కోట్లకు కుదించింది. సవరించిన అంచనాల్లో రూ.1.97 లక్షల కోట్లకు కుదించారు. ఇక అంతకంటే ఎక్కువ కేటాయించలేమని మోడీ సర్కార్ చెప్పేసింది. ఇప్పుడు రూ.2.04 లక్షల కోట్లు ఇచ్చేస్తున్నాం అని ప్రకటించింది. 65 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. పోయిన సంవత్సరం రూ.2.60 లక్షల కోట్లు కేటాయించింది. ఖర్చుపెట్టింది 1.90 లక్షల కోట్ల రూపాయలే. అంటే, రూ.75 వేల కోట్లను గ్రామాల అభివృద్ధికి ఇక ఖర్చు పెట్టలేమని పార్లమెంట్ సాక్షిగా మోడీ సర్కారు తెగించి చెప్పింది.మల్టీనేషనల్ కంపెనీల ప్రభుత్వం కాకపోతే ఏమవుతుంది? గ్రామీణాభివృద్ధికి రూ.75 వేల కోట్లు తగ్గించడమేంటి? మానవుల వ్యాధులకు ప్రధాన కారణం తాగే నీళ్లు శుభ్రంగా లేకపోవడం, సరైన ఆహారం అందకపోవడమే కారణమని ఐక్యరాజ్యసమితి ఘోషిస్తున్నది. పోయిన సంవత్సరం జల జీవన్(రక్షిత తాగునీటి జలాల కోసం)కు రూ.70 వేల కోట్లు కేటాయించి…దాన్ని రూ.22 వేల కోట్లకు సవరించారు. 70 శాతం నిధులనే జలజీవన్ కు వాడారు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? మీకు మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ వాటర్ వస్తాయని చెబుతున్నారు. కిన్లీ, బిస్లరీ, టాటా, పెప్సీ, కోకకోలా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎన్నో కంపెనీలు వచ్చాయి కాబట్టి శుభ్రమైన వాటర్ను మీరు కొనుక్కుని తాగండి..మేం డబ్బులను ఇవ్వబోం అని తేల్చి చెప్పింది. ఇప్పుడు గొప్పగా రూ.65 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు గొప్పగా చెప్పింది. పోయినసారే ఖర్చుపెట్టలే.. ఈసారి ఏం ఖర్చుపెడుతుంది ఇంకా విచిత్రకరమైన, ఆందోళనకరమైన అంశాలేంటి అంటే.. రైతులకు అత్యంత ముఖ్యమైనది యూరియా. పోయిన బడ్జెట్లో యూరియాకు రూ.1.19 లక్షల కోట్లు కేటాయించి రూ.1.18 లక్షల కోట్లను ఖర్చు చేసింది. ఇప్పుడు 1.18 లక్షల కోట్ల రూపాయలనే ప్రకటించింది. వ్యవసాయానికి సరిగ్గా నిధులు ప్రకటిస్తే రైతు బతుకుతాడు. ఈ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. రైతులు బతికితే కంపెనీలు వ్యవసాయంలోకి రావు. జీడీపీలో రూ.70 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ రంగంపై అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీల దృష్టి పడింది. అందుకే ఫర్టిలైజర్లకు ఇచ్చే నిధులను పెంచలేదు. రైతులు దివాళా తీస్తే కార్పొరేట్లు వ్యవసాయాన్ని కబ్జా చేయడం సులువవుతందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది. అందుకే వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు తగ్గించిందనే విషయం తేటతెల్లం అవున్నది. మూడో అంశం.. సామాజిక న్యాయం. ఎవరు కాదన్నా అవునన్నా మన దేశంలో కులం ఉంది. కుల వివక్ష ఉంది. మతముంది. మతపరమైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ నిర్మూలించాలనే విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు రూ.54 వేల కోట్లు కేటాయిస్తే సిమెంట్, ఐరన్ రేటు పెరిగిన నేపథ్యంలో అవి సరిపోదని మేం గొడవ చేశాం. అయినా, సర్కారుకు పట్టలేదు. రూ.32,426 కోట్లు అంటే దాదాపు 40 శాతం నిధులు కేటాయించిన దాంట్లో కత్తిరించి పడేసింది. ఇది అహంభావంతో కూడుకున్నది కాదా అర్బన్ ప్రాంతానికి సంబంధించి రూ.30 వేల కోట్లు ఇచ్చారు. ఖర్చపెట్టింది రూ.13,672 కోట్లు మాత్రమే. 60 శాతానికిపైగా నిధులు ఖర్చుపెట్టలేదు. కాగితాల్లో ఇప్పుడు ఇండ్లు కట్టుకునేందుకు రూ.60 వేలు ఇస్తామంటున్నారు? ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని ఇండ్లు ఇవ్వలేని ప్రభుత్వం అనొద్దా? పోయిన సంవత్సరం ఆరోగ్య రంగానికి రూ. 89 వేల కోట్లు కేటాయించి రూ.88 వేల కోట్లే ఖర్చుపెట్టారు. విద్యారంగానికి రూ.1.25 లక్షల కోట్లు కేటాయించి ఖర్చుపెట్టింది 1.14 లక్షల కోట్ల రూపాయలే. అంటే సవరించిన దాంట్లో 8 శాతం తగ్గించింది. సోషల్ వెల్ఫేర్ పట్ల మరింత దుర్మార్గం వ్యవహరించింది. 70,80 జనాభా ఉంది. ఈనాటికీ అంటరాని తనం విలయతాండవం చేస్తున్నది. కులం పేరుతో వివాహాలు చేసుకుంటే చంపేస్తున్నారు. ఈ పరిస్థితిని ఎదురించే శక్తి రావాలంటే సామాజిక న్యాయం చేయడం కీలకం. పోయినసారి రూ.52 వేల కోట్లు కేటాయించి..సవరణల్లో రూ.46 వేల కోట్లకు తగ్గించారు. అంటే 18 శాతం తగ్గించారు. కేటాయింపుల్లో పేపర్ల మీద బాగా చూపి గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ రంగాలకు, సామాన్య ప్రజానీకానికి సంబంధించిన నిధుల్లో కేంద్రం నిర్ధాక్షిణ్యంగా కోతపెడుతున్నది ముమ్మాటికీ నిజం. రక్షణ శాఖకు పెంచింది. కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఎక్కువగా ఇచ్చింది. కార్పొరేట్లకు సవరించిన అంశాల్లో పెంచుకుంటూ పోతున్నది. సామాజిక అంశాలకేమో తగ్గిస్తూ పోతున్నది. ప్రధానమంత్రి పేరుతో ఎస్సీ పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇస్తున్నాం. పోయినసారి రూ.6,050 కోట్లు కేటాయిస్తే సరిపోవని చెప్పాం. రూ.4,500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. సవరించిన దాంట్లో 22 శాతం కోతపెట్టారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఇది అన్యాయం చేయడం కాదా? ఆ పిల్లలు ఉన్నత చదువులు చదువొద్దనే కుట్ర దాని వెనుక ఉన్నట్టేగా ఇది ఆధిపత్య కులాల బడ్జెట్ అని ఎందుకు అనొద్దు? ఇప్పుడు రూ.7 వేల కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పకుంటున్నరు. ఎస్టీ పిల్లలకు ఇచ్చింది రూ.4,300 కోట్లు. సరిపోవని వాదించినా..ఖర్చుపెట్టింది రూ.3,630 కోట్లే. సవరణ పేరుతో మోడీ సర్కారు కట్ చేస్తున్నదనే విషయం స్పష్టమవుతున్నది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 8 కోట్ల మంది మూడేండ్ల లోపు చిన్నారులున్నారు..కోటిమంది వరకు గర్భిణీలున్నారు. తల్లికి పౌష్టికాహారం అందిస్తే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారనే ఉద్దేశంతోనే అంగన్వాడీ కేంద్రాలను పెట్టారు. పోషక్-1, పోషక్-2 రెండింటింకీ బడ్జెట్లో కోత కోసి పడేశారు. గత బడ్జెట్లో వైబ్రెంట్ ఇండియా అనే పథకాన్ని పెట్టారు. రూ.1,000 కోట్లు కేటాయించి రూ.209 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. వైబ్రెంట్ ఇండియా అంటే ఇదేనా ఇలా చెప్పుకుంటూ పోతే మౌలిక సౌకర్యాల కల్పన మీద దృష్టి సారించలేదు. విద్యావైద్య రంగాలను డబ్బులు పెంచలేదు. సామాజిక పెన్షన్లకు రూ.9,300 కోట్లే కేటాయించారు. మూడేండ్లుగా దీన్ని పెంచలేదు. కేరళలో 60 లక్షల మంది పింఛన్ ఇస్తున్నారు. రాష్ర్టాలకు వాటా పెంచరా? మీరేమైనా భిక్ష వేస్తున్నారా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి దుర్మార్గంగా అన్యాయం చేసింది. తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ర్టాలు విడిపోయేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. అమరావతి కోసం లోన్లు తెచ్చుకోవాలని చెప్పారు. పోలవరంలో కాంట్రాక్టర్లకు ఆగిపోయిన బిల్లులను గుర్తిస్తున్నారు తప్ప నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదు. భూములు, ఉపాధి కోల్పోయిన గిరిజనుల గురించి మాట్లాడటం లేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన దానికి నిధులేవి? తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాజెక్టు కూడా లేదు. వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామన్నారు. వాటికీ బడ్జెట్లో నిధులు చూపలేదు. నిర్మలాసీతామన్ తెలుగింటి కోడలు. ఆమె గురజాడ మాటల్ని ఉటంకిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. గురజాడగారు …తిండి కలిగితే కండ కలదోయ్..కండ కలిగిన వాడే మనుషోయ్…అన్నాడు. తిండేది కండేది? ఆర్.ఎస్.ఎస్ను ఎట్ల ప్రసన్నం చేసుకోవాలి అంబానీ, అదానీలను సంతృప్తి పరచాలా ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ మల్టీ నేషనల్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. ఈ బడ్జెట్ పేదరికాన్ని నిర్మూలించేది కాదు..పేదల్ని నిర్మూలించే బడ్జెట్. ఆకలి చావులను పెంచే బడ్జెట్. నిరుద్యోగాన్ని పెంచే బడ్జెట్. కొనుగోలు శక్తిని తగ్గించే బడ్జెట్. అసమానతలను పెంచే బడ్జెట్. వలసలను పెంచే బడ్జెట్. కార్పొరేట్లు పెంచే బడ్జెట్, పార్లమెంట్ చదివిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ వేయబోమని గొప్పగా చెబుతున్నారు..దీనికి మేం వ్యతిరేకంగా కాదు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాగైనా మచ్చిక చేసుకోవాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మధ్యతరగతివారిపై ప్రేమ ఉండి కాదు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు ఎందుకు తీసుకురారు అత్యంత దుర్మార్గమైన బడ్జెట్. మోడీ ప్రభుత్వం బరితెగించి కార్పొరేట్ల కోసం తీసుకొచ్చిన బడ్జెట్ అని, మతోన్మాదం ద్వారా ప్రజల మధ్య చీలికలు తెచ్చే బడ్జెట్ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లతా, విజయమ్మ , రవిచంద్ర , నిత్య , రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు
