– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటాన్ మహమ్మద్ అలీ ఖాన్
ప్రజాశక్తి – కడప : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వై.యస్.షర్మిలారెడ్డి నాయకత్వం, ఆమె పనితీరును చూసి కూటమి ప్రభుత్వంలో గుబులు పుట్టుకుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ స్పష్టం చేశారు. ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డిపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితం ప్రసాదించి న పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో పేరుందని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కుటుంబానికి రాజకీయ జీవితం ప్రసాదించారని గుర్తు చేశారు. అలాంటి పార్టీ తుడిచిపెట్టుకుపోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పిసిసి అధ్యక్షురాలు వై.యస్. షర్మిలారెడ్డిని ఆరోపిస్తూ ఆమెను గాంధారిగా, ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదన్నారు. అయితే ఆమె రాజకీయంగా కలకత్తా కాళీ మాత లాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షం వహిస్తున్నారన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా భారత దేశాన్ని ఎంతో అభివృద్ధి అభివృద్ధి చేశారన్నారు. జమ్మలమడుగులో పరిశ్రమల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు ఇతర ప్రాజెక్టుల రూపకల్పన, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేశాయన్న వాస్తవం ఎమ్మెల్యే మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వై.ఎస్. షర్మిల రెడ్డి నాయకత్వాన్ని చూసి కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోందని పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కు, వరద బాధితుల తరపున పోరాటం చేయడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం, ఇతర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వై.యస్. షర్మిల రెడ్డిపోరాటం చేస్తున్నారన్నారు. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వంపై కూటమి ప్రభుత్వం భయపడుతోందన్న వాస్తవం ఎమ్మెల్యే వ్యాఖ్యల ద్వారా అర్థమవు తోందన్నారు. ప్రజల్లో వైయస్ కుటుంబానికి ఉన్న ఆదరణ అభిమానం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నిర్ణయించలే రన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ లాంటి మత విద్వేష పార్టీలో చేరి ఆ పార్టీ లో ఉన్న కల్మషాన్ని, విద్వేషం గురించి ప్రజలకు బాగా తెలుసునని వివరించారు. కాంగ్రెస్ పార్టీ పై పెరుగుతున్న ప్రజల ఆదరణను ఎవరు ఆపలేరన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే తొలి ఫైలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ సంతకం చేస్తారన్న హామీ కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. కూటమి ప్రభుత్వం, వైయస్సార్ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమృత సంజీవని లాంటి ప్రత్యేక హోదాను తీసుకురాలేక విఫలమయ్యారని విమర్శించారు. ముందుగా రాష్ట్రాన్ని దివాలా పరిస్థితి నుండి బయటికి తీసుకువచ్చే వ్యవహారంపై దృష్టి సాధించాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందని వివరించారు. నిన్న మొన్న పుట్టిన పుట్టగొడుగులు లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరవ హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు చిన్న కులయప్ప, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మయాన రహమతుల్లా ఖాన్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. కమల్ బాషా, పార్టీ నేతలు హమీద్, గౌరీ దేవి పాల్గొన్నారు.
