ప్రజాశక్తి-కడప
అసంఘటిత కార్మికులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్ చేతుల మీదుగా ఇ-శ్రమ్ కార్డులను అందజేశారు. అసంఘటిత కార్మికుల అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్ లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టపరమైన సహాయం, ఆస్తి వివాదాలు, బాల కార్మికులు, ఉద్యోగి-యజమాని సమస్యలు, ఇ-శ్రమ్ కార్డుల పట్ల అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను గుర్తించడం, వారికి తగు న్యాయ సహాయం అందించడం, ఉచిత న్యాయ సాయం, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 మొదలగు అంశాలపై అవగాహన కలిగించారు. అనంతరం అసంఘటిత కార్మికులకు ఇ-శ్రమ్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కడప, రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కడప, ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా కడప, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కడప, కడప మేనేజర్ మున్సిపల్ కార్పొరేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కడప, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కడప, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు చింతకొమ్మదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి, చెన్నూరు, డిస్టిక్ ఆఫీసర్ కడప, వివిధ రంగాల అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.
