మాజీ ఎంపీ, ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కన్నుమూత
పలువురు నాయకుల సంతాపం
ప్రజాశక్తి -రాయచోటి
తెలుగుదేశం పార్టీలో విషాదం చోటు చేసుకుంది.తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాల కొండ్రాయుడు (78) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి అంటే రాయుడు, రాయుడు అంటే టిడిపి అనేలా ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. పాలకొండ్రాయుడు మరణ వార్త విన్న వెంటనే రాష్ట్రం, జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు సుగవాసి బ్రదర్స్కు ఫోన్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జీవిత ప్రస్తావనం పాలకొండ్రాయుడు దాదాపు మూడు దశాబ్దాల పాటు రాయచోటిలో కీలక నేతగా సేవలు అందించారు.1946 జూలై 3న పాలకొండ్రాయుడు రాయచోటి మాసాపేటలో జన్మించారు. ఆయన రాయచోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించారు. 1968 సంవత్సరంలో డిసెంబర్ 3న వివాహం చేసుకున్నారు. పాలకొండ్రాయుడుకు ఇద్దరు కుమారులు బాలసుబ్రమణ్యం, ప్రసాద్ బాబుతో పాటు కుమార్తె ఉన్నారు. ఆయన కుమారులు సుగవాసి ప్రసాద్ బాబు, బాలసుబ్రమణ్యం ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే చాలా కాలం నుంచే పాలకొండ్రాయుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.సుగువాసి రాజకీయ ప్రస్థానం పాలకొండ్రాయుడు రాయచోటి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, రాజంపేట ఎంపీగా ఒక్కసారి పని చేశారు.1978లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి తొలి సారిగా జనతా పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి మహల్ హబీబుల్లా పై విజయం సాధించారు. 1983లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి కీ.శే.మాజీ ఎమ్మెల్యే మహల్ హబీబుల్లా సతీమణి మహల్ షవరున్నిసాపై విజయం సాధించారు. అనంతరం ఎన్టిఆర్ టిడిపి పార్టీ స్థాపించి టిడిపిలోకి ఆహ్వనిచండంతో పాల కొండ్రాయుడు టిడిపిలో చేరి 1984లో రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అన్నయ్యగారి సాయి ప్రతాప్పై విజయం సాధించారు. అనంతరం 1990లో కాంగ్రెస్ అభ్యర్థి మండిపల్లినాగిరెడ్డి పై పోటి చేసి తొలి సారి ఒటమి పాలయ్యారు. 1992లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మండిపల్లి నారాయణ రెడ్డిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 1994లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 1999లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి మండిపల్లి నారాయణరెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. 2004లో రాయచోటి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఆభ్యర్థిని మార్చి శ్రీలత రెడ్డికు టికెట్ ఇవ్వడంతో ఆమెపై సైతం పాలకొండ్రాయుడు విజయం సాధించారు.2009లో గడికోట శ్రీకాంత్ రెడ్డి పై పోటు చేసి ఓటమి పాలయ్యారు. 31 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో 8 దఫాలు ఎమ్మెల్యేగా పోటి చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజంపేట పార్లమెంట్ స్థానానికి రెండు దఫాలు పోటీ చేసి ఒక సారి ఎంపిగా విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాయుడు వారసులు సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్ బాబులు ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో కొనసాగుతున్నారు. రేపు గురువారం ఉదయం 9 గంటలకు గౌతమ్ థియేటర్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.పలువురు నాయకులు సంతాపం: టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు ఆర్. శ్రీనివాస్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆర్. రమేష్ కుమార్రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, టిడిపి నియోజక వర్గ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, హరి ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, నియోజకవర్గం లోని పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాలకొండ్రాయుడు పార్ధవ దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
