ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి – కడప
ఉద్యోగ విరమణ చెందడం అనేది ప్రతి ఒక్కరికీ ఒక కీలకమైన మలుపు అని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. మేజర్ విజయభాస్కర్ అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఇటీవల రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విరమణ పొందిన ఫిజికల్ డైరెక్టర్ ఎన్సిసి అధికారి మేజర్ విజయ భాస్కర్కు మంగళవారం కడప ఆఫీసర్స్ క్లబ్ లో క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగంలో చేరిన ప్రతిక్కొరూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, ఒకానొక దశకు చేరిన తర్వాత ఆ ఉద్యోగం నుంచి పక్కకు తప్పుకోవడం,. అప్పటివరకు తన జీవితంలో చేసినటువంటి గొప్ప పనులను ఒకసారి తలుచుకోవడం సాధారణమన్నారు. విజయభాస్కర్ ఎన్సిసి అధికారిగా , ఫిజికల్ డైరెక్టర్గా వందలాది మంది విద్యార్థులను ఆర్మీ అధికారులుగా, వ్యాయామ ఉపాధ్యాయులుగా , వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు శాయశక్తులా కషి చేశారని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన జానుమద్ది విజయ భాస్కర్ మాట్లాడుతూ విజయభాస్కర్ వ్యక్తిగతంగా సౌమ్యుడు, స్నేహశీలి, ఇతరులకు సహాయం చేసే గుణం కలవాడని చెప్పారు. కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సాంబశివా రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి రాష్ట్రంలో ఒక మంచి అధ్యాపకునిగా, ఎన్సిసి అధికారిగా అందరికీ ఆదర్శంగా నిలిచి ఇటీవల విరమణ చేసిన మేజర్ విజయ భాస్కర్ తమ కళాశాలకు, విద్యార్థులకు అందరికీ మంచి పేరు తేవడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త లేపాక మధుసూధన్ రెడ్డి, రమణ కుమార్, ఎంఈఓ సుబ్బరామయ్య, రాజంపేట డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ బి. ఆదినారాయణ, డాక్టర్ రాజమోహన్ రెడ్డి, ఇక్కడ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు హజరత్తయ్య పాల్గొన్నారు.
