ప్రజాశక్తి – బద్వేలు
మున్సిపల్ ఉద్యోగ – కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ కోశాధికారి కాలువ శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు గత సమ్మె కాలంలో ఇచ్చిన వాగ్దానాలకు జీవోలు జారీ చేయకపోగా, ప్రస్తుతం ఉన్న ఆప్కాస్ సంస్థను సైతం రద్దుచేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనుకోవడం దుర్మార్గమని చెప్పారు. అటువంటి చర్యలను విరమించుకొని కార్మికులను పర్మినెంట్ చేయాలని స్థానిక మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాలను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయించి వాహనాలపై పని చేస్తున్న కార్మికుల ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు. వాహనాలకు ఇన్సూరెన్సులు పూర్తిస్థాయిలో చేయాలని, గత సమ్మె కాలపు వేతనం మంజూరు చేయాలని, కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, పట్టణ అవసరాలకు అనుగుణంగా పారిశుధ్య వాహనాలను సమకూర్చాలని, చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సిబ్బందిని పెంచాలని పలుమార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరిని విడనాడి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రానున్న కాలంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కె. నాగేంద్రబాబు, యూనియన్ అధ్యక్షులు పులి శాంప్రవీణ్, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు బద్వేల్ ప్రవీణ్ కుమార్, నాగరపు సత్యరాజు, కమిటీ సభ్యులు ఇండ్ల చంద్రశేఖర్,పద్మిశెట్టి రామయ్య,పి.పి.వరప్రసాద్ పాల్గొన్నారు.
