ప్రజాశక్తి – కడప అర్బన్
ఈనెల 17 నుంచి 31 వరకు నిర్వహించబోయే పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం అమరావతి నుంచి పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, కలెక్టర్ కాన్ఫరెన్స్, స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ కావేటి విజయానంద్ కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సందర్భంగా విసి ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ కావేటి విజయానంద్ మాట్లాడుతూ పదవ పరీక్షలకు సంబంధించి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. మొత్తం 3,450 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే ఈ పరీక్షా కేంద్రాలలోనికి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేదించినట్టు స్పష్టం చేశారు. పరీక్షా ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టిసి బస్సులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పదవ పరీక్షల కోసం రాష్ట్ర స్థాయిలో 0866-297454 నంబర్తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. సిఎస్ విసి ముగిసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పదవ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల న్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటుతో పాటు, ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో ఇంటర్నెట్, జెరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు,ఇతర ఉన్నతాధికారులతో సహా ఏ ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలు,మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లరాదన్నారు. పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలపై ప్రజా అభిప్రాయాలను చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఇతర జిల్లా అధికారులతో కలిసి పి-4 పోస్టల్ విడుదల చేశారు. కార్యక్ర మంలో సిపిఒ అజరతయ్య, జిల్లా పంచాయతీరాజ్ అధికారి రాజ్యలక్ష్మి, డిఇఒ షంషుద్దీన్, జడ్పి సిఇఒ ఓబులమ్మ, డిఆర్డిఎ పీడీ ఆనంద్ నాయక్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, అధికారులు పోలీసు, ట్రాన్స్పోర్టు అధికారులు పాల్గొన్నారు.
