ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు : పి.వి. సత్యనారాయణ
ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె
చిన్న, సన్న కారు రైతులు సాంకేతికతను అందిపుచ్చుకొని అధిక దిగుడులు సాధించే విధంగా వినియోగించుకోవాలని ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయ లాంగ్ గుంటూరు పరిశోధన.సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. దక్షిణ మండలి వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం మంగళవారం ఊటుకూరులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానో యూరియా, నానో డిఎపి సమర్ధత స్థాయిని పరిశీలించాలని, పరిశోధనా ఫలితాలను త్వరతగతిన వెల్లడించడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గించాలని చెప్పారు. భూమి, వాయు, నీటి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పురుగు మందుల అవశేషాలను ఆహార ధాన్యాలు, కూరగాయలు పండ్లలో త్వరగా నిర్ధారించే పద్ధతులను గుర్తించి అందుకనుగుణంగా పురుగు మందుల అవశేషాలను నిర్మూలించే పరిశోధనలను వేగంగా పూర్తి చేయాలని శాస్త్రవేత్తలను ఆదేశించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ సమావేశానికి శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులు కీలక భాగస్వాములు కనుక ప్రతి ఒక్కరూ నిబద్దతతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక కోసం తమ విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు. కీటక శాస్త్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి ప్రధాన శాస్త్రవేత్త మురళీకష్ణ మాట్లాడుతూ పురుగు మందుల అవశేష నిర్మూలన పద్దతులు అడివి పందుల యాజమాన్యం గురించి క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం, ఊటుకూరు, ప్రభాకర్ రెడ్డి, ఏరువాక కేంద్రం, ఊటుకూరు, సమన్వయకర్త అంకయ్య కుమార్, కషివిజ్ఞాన కేంద్రం, ఊటుకూరు సమన్వయకర్త డాక్టర్ వీరయ్య, శాస్త్రవేత్తలు డా.కె.సునీల్ కుమార్, డాక్టర్ మధురి, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ భావతప్రియ, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ వి.శిల్పకళ, డాక్టర్. టి.మహేష్ బాబు, కె. సాయి మహేశ్వరి, యస్. మానస, ఐ.సురేష్ కుమార్ రెడ్డి ఐదు జిల్లాల పరిశోధన, విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
