కార్పొరేట్‌ లాభాల కోసమే 4 లేబర్‌ కోడ్లు

May 8,2025 22:16
కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు

ప్రజాశక్తి – కాకినాడ

కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసమే కేంద్రంలోని మోఢ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని కేంద్ర కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం స్థానిక టీచర్స్‌ హోమ్‌లో జిల్లా స్థాయి సదస్సు జరిగింది. తొలుత సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యాక్షులు జె.వెంకటేశ్వర్లు విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్బంగా సిహెచ్‌.నరసింగ రావు, జె.వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఎఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్‌ గొడుగు సత్యనారాయణ మాట్లాడుతూ బ్రిటిష్‌ వాడితో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మోడీ మతోన్మాద ప్రభుత్వం భారతీయ కార్మిక వర్గాన్ని యాజమాన్యాలకు బానిసలుగా మార్చేందుకు నాలుగు లేబర్‌ కోడ్‌ లను తెచ్చిందని విమర్శించారు. ఈ లేబర్‌ కోడ్ల వల్ల కార్పొరేట్ల లాభాలు పెరిగి, కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారిపో తారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్రానికి ముందుగాని, తర్వాత గాని వచ్చిన కార్మిక చట్టాలు ఏవి కూడా ఒకరి దయతో వచ్చినవి కాదని, వేలాదిమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న హక్కులని గుర్తు చేశారు. 3 నల్ల చట్టలతో రైతులను, 4 లేబర్‌ కోడ్లలో కార్మికులను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కరోనా సంక్షోభాన్ని, ఉగ్రవాద సంక్షోభ పరిస్థితులను మోడీ మతోన్మాద ఎజెండాను అమలుపరిచేందుకు, కార్పొరేట్‌ శక్తులను సంతృప్తి పరిచేందుకు వాడుకుంటుందని విమర్శిం చారు. ఇటువంటి కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు సమ్మెల ద్వారా కట్టడి చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్‌, ఎల్‌ఐసి, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొంటున్నారని, ప్రభుత్వ పథకాలలో పనిచేసే ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా సమ్మెను బలపరచడం ద్వారా మోడీ కార్పొరేట్‌ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఎల్‌ఐసి సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, షేక్‌ పద్మ, నక్కెళ్ళ శ్రీను, రొంగుల ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, వేణి, వెంకటలక్ష్మీ, ఐఎఫ్‌టియు రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణ మూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాగుల రఘువులు, గరగ దుర్గారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లచ్చారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️