ప్రజాశక్తి – అమలాపురం, అయినవిల్లి
కుడుపూడి రాఘవమ్మకు ప్రజలు, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధ పడుతూ ఆమె మంగళవారం స్వగ్రామమైన అయినవిల్లి మండలం తొత్తరమూడిలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియులు బుధవారం నిర్వహించారు. పలువురు సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఐద్వా సీనియర్ నాయకులు టి.సావిత్రి, సిపిఎం నాయకులు జి.బేబిరాణి తదితరులు ఆమె పాడెను మోస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.పిడిఎఫ్ ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు రాఘవమ్మ భౌతికకాయంపై సిపిఎం జెండాను ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాఘవమ్మ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎర్ర జెండా పట్టుకుని ఏళ్ల తరబడి ప్రజా సమస్యలపై పోరాటం చేశారాన్నరు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కమ్యూనిస్టులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. భర్త మరణం తరువాత కూడా ఉద్యమాల్లోనే కొనసాగారన్నారు. ఆమెను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. అనంతరం సిపిఎం డాక్టర్ బిఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు కె.కృష్ణవేణి సిపిఎం కాకినాడ జిల్లా నాయకులు దువ్వా శేషాబాబ్జి, జి.బేబిరాణి, కెఎస్.శ్రీనివాస్, ఎం.రాజ్ శేఖర్ మాట్లాడుతూ కుడిపూడి రాఘవమ్మ నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై విశ్రాంతిలేని పోరాటం చేశారన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ పార్టీ విలువలకి కట్టుబడి తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి.దుర్గాప్రసాద్, టి.నాగవరలక్ష్మి, వ్యవసాయకార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సింహాచలం, పలివెల వీరబాబు, ఎం.వెంకటరమణ, ఎం.రామకష్ణ, పి.రామకృష్ణ, సిహెచ్.పద్మ, పీతల రామచంద్రరావు, వెంకట్రావు, కాంత్రికుమార్ తదితరులు పాల్గొన్నారు.