ప్రజాశక్తి – తాళ్లరేవు
మండలంలోని ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘానికి కమ్యూనిటీ స్థలం కేటాయించాలని ఎంపి గంటి హరీష్మాధుర్, ఎంఎల్ఎ దాట్ల సుబ్బరాజును సంఘీయులు కోరారు. ఆదివారం మండలంలోని సుంకటరేవు వద్ద ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపి, ఎంఎల్ఎ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఈశ్వరరావుతో కలిసి వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మండలంలో ఉన్న 96 కుటుంబాలు ఉన్నాయని, 2009లో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సంఘ సమావేశాలు నిర్వహించు కోవడానికి ఇబ్బంది పడుతున్నామని, కమ్యూనిటీ స్థలం కేటాయించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘానికి కమ్యూనిటీ స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు భారతి రాజు, మానుపాటి వెంకటరమణ, మాచగిరి పెంటయ్య, భారతి ఈశ్వరరావు, అమలదాసు లోవరాజు, మానుపాటి అప్పారావు పాల్గొన్నారు.