ప్రజాశక్తి – పెద్దాపురం
లేబర్ కోడ్లు రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సిఐటియు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సార్వత్రిక సమ్మెపై ప్రచురించిన బుక్ లెట్ ను కార్మిక సంఘ నేతలు ఆవిష్కరించారు. అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అనేగా సమస్యలతో సతమతమవుతుందన్నారు. వేతనాలు పెరగక కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. కార్మికులను ఆదుకోవలసిన పాలకవర్గాలు వారి హక్కులను హరిస్తున్నాయని అన్నారు. కార్మిక హక్కుల కోసం ఈనెల 20న తలపెట్టిన ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు సిఐటియు ఆధ్వర్యంలోని కార్మిక సంఘాలు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు దాడి బేబీ, మాగాపు నాగు, గూనూరు వెంకటరమణ, తాడిశెట్టి గంగ, డి. క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.