ప్రజాశక్తి-కాకినాడ వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రికి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ రూ.55 లక్షలతో సామగ్రి అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. సామాజిక బాధ్యత కింద కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ ప్రజా సంక్షేమార్థం విరాళంగా అందించిన 3 వెంటిలేటర్లను, 8 మల్టీపారా మానిటర్లు, 8 ఐసియు పడకలు, 8 గైనకాలజీ పరిశీలన బెంచీలను సోమవారం జిజిహెచ్ ట్రామా కేర్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎంపీ తంగెళ్ల ఉదరు శ్రీనివాస్, ఎంఎల్సిలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎంఎల్ఎలు వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసు, కేఎస్పీఎల్ ఎండీ కె.వి.రావు తదితరులు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిజిహెచ్కు సంబంధించి సంవత్సర కాలంలో రూ.55 లక్షలతో సామగ్రి సమకూర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు విరివిగా వైద్య సేవలు అందిస్తున్న జిజిహెచ్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కేఎస్పీఎల్ గొప్ప తోడ్పాటును అందించిందని కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సేవలు అందించడంలో కాకినాడ జిజిహెచ్ రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు సంపాదించుకుందని, ఈ ఆసుపత్రి మరింత అభివద్ధి చేయడానికి ప్రభుత్వం కషి చేస్తుందని దీనితో పాటు జిల్లాలోని ఇతర ఆసుపత్రుల అభివద్ధికి తమ సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ నాలుగైదు జిల్లాల నుంచి ప్రజలు నిత్యం జిజిహెచ్కు వైద్య సేవల నిమిత్తం వస్తూ ఉంటారన్నారు. గత సంవత్సరంలో 8 లక్షల మంది ఔట్ పేషెంట్లు, 17 వేల మంది ఇన్ పేషెంట్స్ వైద్య సేవలు పొందగా సుమారుగా 45 వేల సర్జరీలు జిజిహెచ్ ద్వారా జరిగాయని ఎంపీ తెలిపారు. జిజిహెచ్ అభివృద్ధికి ప్రజాప్రతినిధులుగా తాము, అధికారులు తమ వంతు బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేసినట్టు తెలిపారు. రంగరాయ వైద్య కళాశాలకు టీచింగ్ ఆసుపత్రిగా జిజిహెచ్ అనుబంధంగా పనిచేస్తూ భవిష్యత్తు తరాలకు వైద్య సేవలను అందించే వైద్యులను అందిస్తుందన్నారు. క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో త్వరలో జిజిహెచ్లో ప్రత్యేక క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్.విఠల్, కేఎస్పీఎల్ సిఇఒ మురళీధర్, వివిధ విభాగాల వైద్య అధికారులు పాల్గొన్నారు.
