ప్రజాశక్తి – గొల్లప్రోలు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బుధవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కుంచే చిన్న, మండల అధ్యక్షులు ఓరుగంటి నందీశ్వరుడు, సిఐటియు నాయకులు కరణం విశ్వనాథం మాట్లాడారు. శానిటేషన్ వర్కర్లు పనిచేయడానికి కావలసిన పనిముట్లు, వాహనాల మెటీరియల్స్ అందించడం లేదన్నారు. సబ్బులు, బ్లౌజులు, నూనె, యూనిఫాం ఇవ్వాలని, ఇనుప చక్రాల బళ్ళుకు మరమ్మతులు చేపట్టాలని, చీపుర్లు అందజేయాలని కోరారు. నగర పంచాయతీ పరిధిలో శానిటేషన్ వర్కర్ల సంఖ్యను పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల క్రితం మృతి చెందిన కార్మికుడు బంగారు రాముకు నష్ట పరిహారం రూ.2 లక్షలు వచ్చాయని అధికారులు వెల్లడించారని, అయితే ఆ పరిహారాన్ని నేటికీ ఇవ్వలేదన్నారు. కోవిడ్ కాలంలో పనిచేసిన 8 మందికి ఇప్పటికీ జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. అనంతరం నగర పంచాయతీ మేనేజర్ నవీన్ చంద్రకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ అధ్యక్షులు ఎన్.ఏసమ్మ, సిహెచ్.రమణ, రామారావు, రాజు, రాజమోహన్, లోవరాజు, సత్యవతి, దివ్యవాణి, సింహాచలం, పైడిరాజు, చిన్ని, లోవకుమారి, వెంకటేశ్ పాల్గొన్నారు.