ప్రజాశక్తి – కాకినాడ/పెదపూడి
వైసిపి ఎంఎల్సి అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోరు డెలివరీ చేసిన కేసును సిట్తో తిరిగి సమగ్ర విచారణ జరిపించాలని విశ్రాంత డిజిపి ఎబి.వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెదపూడి మండలం జిమామిడాడ గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కలసి ఆయన వివరాలు సేకరించారు. వారితో కలిసి కాకినాడ వచ్చి కలెక్టర్ షాన్మోహన్ను కలిసి బాధిత కుటుంబానికి ఇంకా అందవలసిన ఆర్థిక సాయంపై చర్చించారు. ఎస్పి బిందు మాదవ్ను కలిసి కేసు పురోగతిపై వివరా లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి ఎస్పి, కొందరు పోలీసు అధికారులు సక్రమంగా కేసు విచారణ చేపట్ట లేదని, అప్పటి ఛార్జ్ సీటు చూస్తే తేటతెల్లమైంద న్నారు. ఈ కేసును సిట్కు అప్పగించి మొదటి నుంచి దర్యాప్తు చేసి దోషులను గుర్తించి అరెస్టు చేయా ల్సిన అవసరం ఉందన్నా రు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్, సుబ్రహ్మణ్యం తల్లి దండ్రులు వీధి సత్యనారాయణ, వీధి నూకరత్నం, తమ్ముడు వీధి నవీన్కుమార్, ఆర్పిఐ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిళ్ల శ్రీనివాసరావు, చైతన్య ఆర్గనైజేషన్ అధ్యక్షులు కడలి సత్యమూర్తి, కడలి కిషోర్, కోడికత్తి శీను తదితరులు పాల్గొన్నారు.ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలిదళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోరు డెలివరీ చేసిన కేసులో అప్పటి కాకినాడ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి వారి అనుచరులు పోలీసు వ్యవస్థను మేనేజ్ చేశారని ఆరోపించారు. వైసిపి అధికారంలో ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరిని పడితే వారిని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, వారి అనుచరులు, వారి వ్యాపార భాగస్వాములు చేసిన రేషన్ బియ్యం దోపిడీ కేసు ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకుండా ఉందని వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి అవసరమైన సాక్షాలను సేకరించి అక్రమ రవాణా చేసి కోటీశ్వరులు అయ్యారో తేల్చి ఆ డబ్బంతా వారి నుంచి రాబట్టాలని డిమాండ్ చేశారు.