ప్రజాశక్తి – సామర్లకోట వాతావరణం ఒకవైపు ఇబ్బందులు పెడుతుంటే మరొకవైపు బ్యాంకు గ్యారంటీలు టార్గెట్లు లేవంటూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయని రైతు సేవా కేంద్రాలు ఎందుకని సిబ్బంది బయటకు వెళ్తే తాళాలు వేసేస్తామని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామర్లకోట ఎంపిడిఒ కార్యాలయం వెనకున్న రైతు సేవా కేంద్రాన్ని భీమవరం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు బుధవారం ముట్టడించారు. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ సిబ్బందిని నిలదీశారు. బ్యాంకు గ్యారంటీ లేవని, టార్గెట్ లేవని చెబుతున్నారని అటువంటప్పుడు రైతు సేవ కేంద్రంలో మీకు పనేముందని బయటికి రండి అంటూ పిలిచి సిబ్బంది బయటకు రాగా భీమవరం రైతులు రైతు సేవా కేంద్రానికి తాళం వేశారు. అనంతరం పక్కనే ఉన్న మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద రైతుల నిరసన వ్యక్తం చేసి ఎఒ కార్యాలయానికి కూడా తాళం పెట్టి సిబ్బంది వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. కార్యాలయంలో ఉన్న ఎఒ సత్య వచ్చి రైతులకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తదితర ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ నిరసనలో రైతులు చెక్కపల్లి వీరబాబు శెట్టిబత్తుల ధర్మరాజు గూడూరు రాజు ఉన్నారుఱ.
