ప్రజాశక్తి – పెద్దాపురం
పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్, ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఉచిత పాలిసెట్ కోచింగ్ నిర్వహిం చబడుతుంది. అనుకున్న లక్ష్యానికి మంచి విద్యార్థులు ఉచిత శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్ద సంఖ్యలో అందరూ శిక్షణ తీసుకుంటున్నారు. విద్య వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత సమాజంలో ధనవంతుల పిల్లలు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు చెల్లించి శిక్షణ పొందుతుంటే పేద కుటుంబాల పిల్లలు నిస్సహాయంగా చూస్తూ టెక్నికల్ కోర్సులకు దూరంగా ఉండిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పిసిసి, ఎస్ఎఫ్ఐ సాహసోపేతంగా పేద విద్యార్థులకు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. 70 మంది ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఆరు గంటల పాటు ఈ కోచింగ్లో బోధించడం, సందేహాల నివృత్తి, పాఠ్యాంశాలపై పరీక్షలు, మూడు రోజులకు ఒకసారి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిక్షణా శిబిరంలో భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించేందుకు సీనియర్ ఉపాధ్యా యుడు బుద్ధా శ్రీనివాస్, మ్యాథమెటిక్స్ బోధించేందుకు నీలపాల బాలమురళీకృష్ణ ముందుకొచ్చి సెలవుల సమయాన్ని కుటుంబానికి పరిమితం చేయకుండా పేద కుటుంబాల విద్యార్థుల ఉన్నతికి కేటాయించి తమ శిక్షణను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌళిక సదు పాయాలు నిర్వాహకులు ఉచితంగా అందజేస్తున్నారు. ‘అందరికీ ఉచిత విద్య అందరికీ ఉపాధి’ లక్ష్యంతో ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో దేవత రాజేష్ కుమార్, నెల్లూరి హర్ష వంటి దాతల సహాయ సహకారాలతో విద్యార్థులందరికీ అవసరమైన పాలీసెట్ కోచింగ్ మెటీరియల్ ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాల కల్పన, కోచింగ్ నిర్వ హణకు సమన్వయకర్తలుగా పిసిసి సభ్యులు అమృత, నమ్రత, మణికంఠ వ్యవహరిస్తున్నారు. పిసిసి అధ్యక్ష, కార్యదర్శులు కూనిరెడ్డి అరుణ, రొంగల అరుణ్కుమార్ సేవలందిస్తు న్నారు. ఈ శిక్షణలో సామాజిక అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నారు. పూలే, డాక్టర్ బిఆర్.అంబేద్కర్, కందుకూరి వీరేశలింగం జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ, మరణించిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేటలో ఉచిత కోచింగ్ సెంటర్ జగ్గంపేటలో యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ, జెవివి ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్ 50 మంది విద్యార్థులతో నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఉపాధ్యాయులుగా డి తమ్మాయిత, కె.సూర్యనారాయణ, కె.బంగారయ్య, పివి.గంగాధర్, ఎం.మురళీకృష్ణ, కె.ఈశ్వరరావు శిక్షణ ఇస్తున్నారు. సమన్వయకర్తలుగా ఆయా ప్రజాసంఘాల నాయకులు జి.వెంకటేశ్వరరావు, బి.కోటేశ్వరరావు, మణికంఠ, పి.బాలాజీ, జిఎస్హెచ్పి.వర్మ వ్యవహరిస్తున్నారు.