ధాన్యం సేకరణ లక్ష్యాలు పెంపు

May 5,2025 22:41
ధాన్యం సేకరణ లక్ష్యాలు పెంపు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యాలను పెంచామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కాకినాడ జిల్లాకు 50 వేల టన్నులు బొండాలు రకం, బిఆర్‌ కోనసీమ జిల్లాకు లక్ష టన్నులు, తూర్పు గోదావరి జిల్లాకు ఇప్పటికే పెంచిన 30 వేలకు అదనంగా మరో 50 వేలు సేకరణ లక్ష్యాలను పెంచామని తెలిపారు. అలాగే అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కాకినాడలోని కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాల్లో కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జెసిలు, ప్రజాప్రతినిధులు, రైసుమిల్లలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. రబీలో ధాన్యం సేకరణలో ఎదురౌతున్న సమస్యలపై ఆయా ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రికి వివరించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం, రైతులు ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రగతిని జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా వివరించారు. ట్రాన్స్‌ పోర్ట్‌ కోసం ఉపయోగించే ట్రైలర్ల సర్టిఫికేషన్‌కు తీవ్ర జాప్యం జరుగుతోందని ఎంఎల్‌ఎలు తెలిపారు. రవాణా శాఖ అధికారలతో చర్చించి పరిష్కరిస్తామని జెసి తెలిపారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యానికి మద్దతు ధర ప్రకారం పరిహారం అందించాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ కోరారు. బొండాలు రకం బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు ఎఫ్‌సిఐ పర్మిషన్‌ కోసం కోరామని, పర్మిషన్‌ వచ్చే లోపు కొనుగోళ్లు కొనసాగించాలని పౌర సరఫరాల సంస్థ ఎమ్‌డి డాక్టర్‌ మనజీర్‌ జిలానిసామ్యూల్‌ మిల్లర్లను కోరారు. రైతుల నుంచి ఎంత ధాన్యమైనా కొనడానికి సిద్దంగా ఉన్నామన మిల్లరు తెలిపారు. ఎఫ్‌సిఐలో మాన్యుయల్‌ గ్రెయిన్‌ ఎనాలసిస్‌ వల్ల రిజెక్షన్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆటోమేటిక్‌ అనాలసిస్‌ అమలు చేసేలా చూడాలి మిల్లర్లు కోరారు. అలాగే డైలీ టార్గెట్‌ విధానాన్ని సడలించాలన్నారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పంట కోతల సమయాల్లో తేడాలు ఉన్నందున రైతుసేవా కేంద్రాల లక్ష్యాలను సవరించాలని కొత్తపేట ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు కోరారు. అలాగే గతంలో ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు నిర్వహించిన డ్వాక్రా సంఘాలకు పెండింగ్‌ ఉన్న సుమారు రూ.16.75 లక్షల కమిషన్‌ చెల్లించాలని మండపేట ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు జ్రాజెక్ట్‌ల కింద పంటలు సాగవుతున్నాయని, గోకవరం మండలంలో రైస్‌ మిల్లలు లేవని, అందువల్ల ప్రభుత్వ పరంగా కొనుగోళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ కోరారు. పెదపూడి మండలం రైతుల ధాన్యాన్ని సమీపంలో ఉన్న బిక్కవోలు మండలం రైస్‌ మిల్లులకు కాకుండా కాకినాడ జిల్లాలోని మిల్లులకు టై అప్‌ చేయడం వల్ల రైతులు రవాణా సమస్య ఎదుర్కొంటున్నారని అనపర్తి ఎంఎల్‌ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంత్రి దష్టికి తెచ్చారు. అలాగే సియంఆర్‌ బ్యాంకు గ్యారెంటీనీ 1:1 కాకుండా 1:2 నిష్పత్తికి మార్చాలని అన్ని జిల్లాల మిల్లర్లు కోరారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నడూ లేని విధంగా గడచిన 9 నెలల్లో 49.45 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. రూ.11,400 కోట్లను రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లో జమ చేశామన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం అంతా కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం నిమ్ము 22 శాతం వరకూ ఉన్నా కొనుగోళ్లు జరపాలని అధికారులకు ఆయన ఆదేశించారు. వర్షాల వల్ల పంటనష్టంపై ఎన్యూమరేషన్‌ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కలెక్టర్లను అదేశించామని తెలిపారు. రైతులతో పాటు మిల్లర్ల హితం కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందన్నారు. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వ కృషిలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇకపై బ్యాంకు గ్యారంటీనీ ప్రమాణికంగా 1:2గా అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదరుశ్రీనివాస్‌, ఎంఎల్‌సి పేరాబత్తుల రాజశేఖరం, ఎంఎల్‌ఎలు పంతం నానాజీ, దాట్ల సుబ్బరాజు, వనమాడి కొండబాబు, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌, కుడా చైర్మన్‌ తుమ్మల రామస్వామి, బిఆర్‌ అంబెద్కర్‌ కోనసీమ జిల్లా జెసి టి.నిశాంతి, తూర్పుగోదావరి జిల్లా జెసి ఎస్‌.చినరాముడు, మూడు జిల్లాల రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్నరామకష్ణ, కర్రి వెంకటరెడ్డి, సిహెచ్‌వివివిఎస్‌ఎస్‌.చౌదరి, పౌర సరఫరాల సంస్థల జిల్లా మేనేజర్లు, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు పాల్లొన్నారు.

➡️