ప్రజాశక్తి – పెద్దాపురం, జగ్గంపేట
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంపై జరిగిన దాడిని కుడా ఛైర్మన్ తుమ్మల బాబు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని అన్నారు. ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పే అని, ఈ దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పార్టీ కార్యక్రమాల్లో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. అలాగే ఈ దాడిని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఖండించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన వ్యక్తి దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుందని, ఆ వ్యక్తికి పార్టీకి సంబంధం లేదన్నారు. మతి స్థిమితం లేక ఆ వ్యక్తి 6 నెలల నుంచి తన కుటుంబ సభ్యులపై దాడులు చేయడం జరుగుతుందని, ఇదే మాదిరిగా ఇలా చేయడం జరిగిందన్నారు.