ఈ ఏడాది మార్చి 31కి 15.53 కోట్ల నికర లాభం
టౌన్ బ్యాంక్ చైర్మన్ రవీంద్ర వెల్లడి
ప్రజాశక్తి-కాకినాడ : ఖాతాదారులకు మరిన్ని సేవలను ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు లిమిటెడ్ అందిస్తోందని ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.53 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించిందని టౌన్ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల్లో 46 బ్రాంచీలతో రెండవ స్థానంలో ఉందని ఖాతాదారులకు చెప్పారు. ఆదివారం టౌన్ బ్యాంక్ ఖాతాదారులతో సమావేశం కాకినాడలోని సుబ్బయ్య గ్రాండ్ హోటల్లో జరిగింది. బ్యాంక్ సంబంధించి ఆర్థిక వివరాలను ఖాతాదారులకు రవీంద్ర వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 31కి 1110.40 కోట్ల డిపాజిట్లు, 750.16 కోట్లు రుణాలు ఉన్నట్లు చెప్పారు. ఖాతాదారులకు మేలైన సేవలు అందించి వారి మన్ననలను పొందుతున్నట్లు తెలిపారు. ఇంకా బ్యాంకు పురోగతిపై ఆయన వివరించారు. టౌన్ బ్యాంకులో ఫోన్ పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకు ఎనిమిది ఏటీఎంలు ఏర్పాటు చేయగా ఆరు సొంత భవనాలు కలిగి ఉన్నాయన్నారు. నిర్వహణ లేని ఖాతాల సొమ్మును గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 2. 54 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంకు ఖాతాకు పంపించినట్లు చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఖాతాదారులు తమ ఖాతా సొమ్మును వాపస్ చేయమని కోరితే వారి గుర్తింపును పరిశీలించి నిర్ణీత దరఖాస్తు ఆధారంగా ముందస్తుగా బ్యాంకు చెల్లింపులు చేసి ఆ మొత్తానికి తగిన ఆధారాలతో రిజర్వ్ బ్యాంక్ నుండి క్లైమ్ చేసుకోవాలని తెలిపారు. నిర్వహణలో లేని ఖాతాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బ్యాంకు నుండి ఏడాదికి పౌరులకు 50 వేలు, సీనియర్ సిటిజనులలో లక్ష రూపాయలు వడ్డీ తీసుకునే వారికి పన్ను మినహాయించాలని ఉన్నా వీరు 15జి లేదా 15హెచ్ ఫారాలను అందించి పొందాలన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ఈ మినహాయింపు పొందేందుకు వ్యక్తులు ఫోన్ నెంబర్లతో పాటు ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరని నిబంధనను విధించిందని అందువల్ల ఫోన్ నెంబర్, ఆధార్ అనుసంధానం బ్యాంకు ఖాతాకు చేసుకోవాలని సూచించారు. ఖాతాదారులకు సుమారు 45 ఏళ్ల నుండి టౌన్ బ్యాంక్ రకరకాల సేవలందిస్తూ వారి మన్ననలను పొందుతుందని చైర్మన్ రవీంద్ర చెప్పారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని మీకు వచ్చిన ఓటీపీ మీ కార్డు పిన్ నెంబర్ గాని బ్యాంక్ నుండి ఎవరు ఫోన్ చేసి అడిగినా ఆ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. అనంతరం ఖాతాదారులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలను రవీంద్ర నివృత్తి చేశారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు సత్తి రామారెడ్డి, రిమ్మలపూడి ధర్మేంద్ర, కంటిపూడి సత్యనారాయణ, సీఈవో సి సుగుణ రావు తదితరులు పాల్గొన్నారు.