చిన్నారులపై చిన్నచూపు

May 6,2025 22:19
పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకే ఎండవేడిమి నుంచి ఉపశమనం ఉండాలంటే రెండు నెలల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కార్పోరేట్‌ స్కూళ్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ బడులన్నీ మూతేశారు. చివరకు కోర్టులకు సైతం వేసవి సెలవులు వర్తిస్తున్నాయి. కానీ చిన్నారులకు నిర్వహించే అంగన్‌వాడీ బడులకు మాత్రం సెలవులు లేకుండా చేసిన తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎండవేడిమి పెరుగుతున్న వేళ అంగన్‌వాడీ కేంద్రాలు తెరవాల్సిందేనని అధికారులు ఆదేశాలివ్వడం విమర్శలకు తావిస్తోంది. చిన్నపిల్లలు వడదెబ్బకు గురయితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.కాకినాడ జిల్లాలో 10 ప్రాజెక్టుల పరిధిలో 1986 మెయిన్‌, మినీ అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 70 శాతం సొంత భవనాలుండగా మిగిలినవి అద్దె భవనల్లో కొనసాగుతున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ 1.38 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 11,518 మంది బాలింతలు, 13,134 మంది గర్భిణులు ఉన్నారు. అయితే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు వర్తింపజేసిన ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం విస్మరించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, చిన్నపిల్లలు వడదెబ్బకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.సౌకర్యాల లేమితో అవస్థలుసెలవులు ప్రకటించనందున ప్రస్తుతం చిన్నారులు ఎండతాకిడికి విలవిల్లాడుతున్నారు. మరోపక్క కేంద్రాల్లో కనీస సౌకర్యాల లేమితో నిర్వాహకులు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతీ నెల కనీసం 25 రోజుల పాటు పౌష్టికాహారం అందించాలనే నిబంధనను ఐసిడిఎస్‌ అధికారులు రూపొందించారు. ప్రస్తుతం దానిని సాకుగా చూపించి సెలవులు ప్రకటించడానికి వెనకాడడంతో అంగన్‌వాడీ కేంద్రాలు అవస్థల మధ్య నడపాల్సి వస్తోంది. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ఏం జరుగుతుందోనని అంగన్‌వాడీలు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం అంగన్‌వాడీ కేంద్రం ముగించిన తర్వాత పిల్లలను ఇంటికి తీసుకెళ్లాల్సిన సమయంలో ఎండ వేడికి గురయితే ఎవరు బాధ్యత వహిస్తారన్నది సమాధానం లేని ప్రశ్నగా మారుతోంది. ప్రత్యామ్నాయాలున్నా…స్త్రీ, శిశు సంక్షేమంలో భాగంగా పౌష్టికాహారం అందించడానికి అనేక మార్గాలున్నాయి. ప్రత్యామ్నాయంగా ప్రతీ ఏటా సెలవులకు ముందే తగిన ఆహారాన్ని ఆయా లబ్ధిదారులకు అందించడం ఆనవాయితీగా ఉంది. తద్వారా పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి ఆటంకం రాకుండా చూసే మార్గం ఉంది. అయినా అధికారులు దానిని పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఉన్న 1986 కేంద్రాల్లో 706 సొంత కేంద్రాలు ఉండగా 1107 అద్దె భవనాల్లో, రెంట్‌ ఫ్రీలో 173 నడుస్తున్నాయి. 50 శాతం మాత్రమే సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగిలిన 50 శాతం అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో, అసౌకర్యాల నడుమ నిర్వహిస్తున్నారు. అలాంటి కేంద్రాలను ప్రస్తుతం వేసవిలో నిర్వహించాల్సిందేనంటూ అధికారులు తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయి సిబ్బందిని చిక్కుల్లో నెడుతోంది.

➡️