ప్రజాశక్తి-తాళ్లరేవు కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని ఉపాధి హామీ చట్టం రక్షణకై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శేషబాబ్జి పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల భవనంలో ఆశా వర్కర్ల సంఘం మండల కార్యదర్శి నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సదస్సులో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్లో భాగంగా ప్రభుత్వం తక్కువ కాలపరిమితి ఉద్యోగాలు కల్పన విధానం తీసుకొస్తుందని, దీనివల్ల కార్మికులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి సమాన వేతనం ఇవ్వాలని ఉన్న జిఒను లేబర్ కోడ్లో భాగంగా రద్దు చేయనున్నారని, ఈ విధానం వల్ల ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిపారు. ఎక్స్గ్రేషియా, గ్రాడ్యుటీ వంటి సదుపాయాల కల్పనకు, పలు డిమాండ్ల సాధనకు కార్మికులంతా ఐక్యం అవ్వాలని తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 12న ఢిల్లీలో జాతీయస్థాయి సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం మే 20న జరిగే సమ్మెలో వివిధ సంఘాల నాయకులను ఐక్యం చేయడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతలక్ష్మి, పార్వతి, కళావతి, టేకుమూడి ఈశ్వరరావు, వల్లు రాజబాబు, అదృష్టదీపుడు, గోడి భాస్కరరావు, ఆశ, అంగన్వాడీలు పాల్గొన్నారు.
