ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
రాష్ట్రంలోని సువిశాలమైన తీర ప్రాంతం, సహాజ వనరులను సమర్ధవంతంగా వినయోగించుకునే విధంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్థన్రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం యాంకరేజ్ పోర్టును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం యాంకరేజ్ పోర్టు నుంచి బార్జిలోకి లోడింగ్ ప్రక్రియను మారిటైమ్ బోర్డు, పోర్టు అధికారులతో కలిసి పరిశీలించచారు. అనంతరం కాకినాడ సీ పోర్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ గేట్ వే పోర్టు లిమిటెడ్ 2018లో ఎంఒయు చేసుకోవడం జరిగిందని, ఈ ప్రాజెక్టు ద్వారా 3 బెర్త్ ల నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. 2026 లక్ష్యంగా పెట్టుకుని ఈ పోర్టు అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. భూసేకరణ వంటి కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత టిడిపి పాలనలో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను రూ.361 కోట్లతో ప్రారంభించామని, అయితే వైసిపి పాలనలో హార్భర్ నిర్మాణంలో అనేక సమస్యలు సృష్టించడంతో సకాలంలో నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. ప్రస్తుత సబ్ కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు చేపట్టినట్లు తెలిపారు. 5 నెలల కాలంలో పనులు పూర్తి చేసి బెర్త్లను మత్స్యకారులకు అంకితం చేస్తామన్నారు. వైసిపి పాలనలో దాదాపు 22 వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, తమ ప్రభుత్వంలో రూ.1061 కోట్లతో గుంతల రహితంగా రహదారులను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సి కర్రి పద్మశ్రీ, ఎంఎల్ఎలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరావు, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్ దామచర్ల సత్య, జడ్పి మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, మారిటైమ్ బోర్డ్ సిఇఒ ప్రవీణ్ ఆదిత్య, ఫోర్డ్ అధికారి ధర్మశాస్త్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.