దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం

May 6,2025 22:20
ఉన్నాయని నేతలు ప్రకటించారు.

ప్రజాశక్తి – కాకినాడ, కోటనందూరు

మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు ట్రాన్స్‌ పోర్ట్‌ సంఘాలు సిద్ధంగా ఉన్నాయని నేతలు ప్రకటించారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్‌లో సిఐటియు, ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సిఐటియు సీనియర్‌ నేత దువ్వా శేషబాబ్జీ అధ్యక్షత వహించి మాట్లాడారు. దేశంలో ట్రాన్స్‌పోర్ట్‌ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టం, గత సంవత్సరం పార్లమెంటులో ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో కొన్ని సెక్షన్లు డ్రైవర్ల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసమైన సంక్షేమ పథకం ఏర్పాటు చేయడం లేదన్నారు. తాజాగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌, బేరసారాల హక్కు, ఉద్యమించే హక్కు కాలరాస్తున్నాయని అన్నారు. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ట్రాన్స్‌పోర్ట్‌ రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు పిలుపు ఇస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్స్‌ నాయకులు నురుకుర్తి ప్రకాశరావు, లారీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎలిపే శ్రీనివాస్‌, టాటా మ్యాజిక్‌ యూనియన్‌ నాయకులు వాలిశెట్టి శ్రీనివాస్‌, మినీ గూడ్స్‌ వ్యాన్‌ నాయకులు టి.రాము తదితరులు మాట్లాడుతూ ఫిట్‌నెస్‌ కోసం పలుమార్లు చలనాలు తీయాల్సి వస్తుందన్నారు. గ్రీన్‌ ట్యాక్స్‌ పేరుతో వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోందన్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, స్పేర్‌ పార్ట్‌ ధరలతో నిరంతరం ట్రాన్స్‌పోర్ట్‌ రంగ కార్మికులు సతమతమవుతున్నారని తెలిపారు. ప్రయివేటు ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె అనంతరం దశలవారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. మే 20న వాహనాలు నిలుపుదల చేసి కాకినాడ మెయిన్‌ రోడ్‌ హెడ్‌ పోస్టాఫీసు నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు జరిగే ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌పోర్ట్‌ రంగ కార్మికులు పాల్గొనాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, కె.సత్తిబాబు, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, ట్రాన్స్‌పోర్ట్‌ సంఘాల నాయకులు నక్కా కృష్ణ, డి.దుర్గారావు, సిహెచ్‌.రాంబాబు, ముత్యాలు, పి.సత్యనారాయణ, ఐ.శ్రీను, మట్టా చిన్ని, దుర్గాప్రసాద్‌, చంద్రరావు, తిరుపతిరెడ్డి, గణేష్‌, దొరబాబు, స్వామి, వెంకట్‌ పాల్గొన్నారు. అలాగే కోటనందూరులో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌కె.పద్మ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల హక్కులను, చట్టాలను కాపాడుకోవడానికి, ప్రభుత్వం నిత్యవసర ధరల పెరుగుదలకు, కరెంటు, పెట్రోల్‌ గ్యాస్‌, ధరలు పెరుగుదలను నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మెలో కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం స్థానిక తహశీల్దార్‌ టి.సుభాష్‌, ఎంఇఒ ఎ.శ్రీనివాస్‌, ఇఒపిఆర్‌డి ఎస్‌. జైరామ్‌కు సమ్మె నోటీసును అందజేశారు.

➡️