అభివృద్ధిపై ప్రణాళికను సిద్ధం చేయాలి

Mar 10,2025 23:20
అధికారులను ఆదేశించారు.

ప్రజాశక్తి – కాకినాడ

హోప్‌ హైలాండ్‌ ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్‌పి జి.బిందు మాధవ్‌, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్‌రెడ్డి, పోర్టు అధికారి కెప్టెన్‌ ధర్మశాస్త, అటవీ, పర్యాటక, మత్స్య, మెరైన్‌ పోలీస్‌ శాఖల అధికారులతో కలిసి హోప్‌ ఐలాండ్‌లో కలెక్టర్‌ పర్యటించారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్‌ ఐలాండ్‌కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉన్న పరిస్థితులు, హోప్‌ హైలాండ్‌ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్‌ సౌకర్యం ఇతర అంశాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ చర్చించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ హోప్‌ ఐలాండ్‌ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ పర్యటనలో జిల్లా మత్స్యశాఖ అధికారి కె. కరుణాకర్‌బాబు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ఎస్‌ఎస్‌ఆర్‌.వరప్రసాద్‌, సెక్షన్‌ అధికారి ఎం.నాగా ర్జున, అసిస్టెంట్‌ టూరిజం అధికారి వి.త్రిమూర్తులు, వాటర్‌ ఫ్లీట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గంగాబాబు, పోర్ట్‌ సిఐ పి.సునీల్‌కుమార్‌, మెరైన్‌ ఎస్‌ఐ పి.సురేష్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️