ప్రజాశక్తి – పిఠాపురం
సంక్రాంతి పండుగను పరష్కరించుకుని కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పి విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పట్టణ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. విచారణ దశలో 160 కేసులు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్లు, స్పెషల్ డ్రైవ్లు, ప్రత్యేక తనిఖీలు ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ పేరుతో జూదాలు, కోడి పందాలు, గుండాట వంటివి జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో వాటిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామ పెద్ద సహ కారంతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించి జుదాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ జి.శ్రీనివాస్, ఎస్ఐ మణికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.