ప్రజాశక్తి – రౌతులపూడి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జీవిత చిత్రం, కళా రూపం నాటకం ప్రదర్శనను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు ఎం.రాజశేఖర్, కెవిపిఎస్ నాయకులు సింహాచలం పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే తన కుటుంబంగా భావించి కన్నబిడ్డ చావును లెక్కచేయని మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. సమాజాభివృద్ధే లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రను కెవిపిఎస్ సహకారంతో ‘సంగం శరణం గచ్చామి’ అనే కళారూపం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ జీవిత చరిత్రను సామాజిక చైతన్య సాంస్కృతిక ఉత్సవాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడిలోని శ్రీ సాయి సూర్య ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ రోడ్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు సింహాచలం, బి.తాతబాబు, బర్రె రాజేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గంగ సూరిబాబు పాల్గొన్నారు.