ప్రజాశక్తి – తాళ్లరేవు
ఉద్యోగులకు పిఆర్సి కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని ఎపి ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు కోరారు. సోమవారం తహశీల్దార్ పి.త్రినాధరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి అత్తిలి వీరవెంకటసత్యనారాయణ మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు రావలసిన డిఆర్ బకాయిలు వెంటనే ఇప్పించాలని కోరారు. ఆ సొమ్మును తీసుకోకుండానే చాలామంది సభ్యులు మరణించారని అన్నారు. గత పిఆర్సిలో తగ్గించిన ఎడిషనల్ క్వాంటం ఆఫ్ ది పెన్షన్ పూర్వ పద్ధతిలో 70 ఏళ్లకు 10 శాతం, 75 ఏళ్లకు 15 శాతంను పునరుద్ధరణ చేసి ఇప్పించాలని కోరారు. ఇహెచ్ఎస్ కార్డుపై వైద్యం చేయలేమని, మెడికల్ రీయంబర్మెంట్పై వైద్యం చేయించుకోమని హాస్పిటల్ వర్గాలు అంటున్నాయని అన్నారు. ఆర్థిక వెసులుబాటు లేక చాలామంది వైద్యం చేయించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఇహెచ్ఎస్ కార్డుపై క్యాష్ లెస్ వైద్యం పూర్తిస్థాయిలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కెవివి.రామకృష్ణయ్య, ట్రెజరర్ దడాల వెంకన్న, కడలి ప్రకాశరావు, ఎలిపే నాగేశ్వరరావు, పుప్పాల రామకృష్ణ, దంగేటి మంగాదేవి, వనిమిశెట్టి గోపాలకృష్ణమూర్తి పాల్గొన్నారు.