ప్రజాశక్తి – కాకినాడ
ఇవిఎం, వివిపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వద్ద ఉన్న ఇవిఎం గోదామును రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇవిఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవిఎం, వివిపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఇవిఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ జె.వెంకటరావు, జిల్లా అగ్నిమాపక అధికారి పివిఎస్.రాజేశ్, అర్బన్ తహశీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిటి ఎం.జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి.సాయిబాబా, ఎస్.అప్పారావు, బి.జయప్రకాష్, ఆర్. వెంకటేశ్వరరావు, టి.ఈశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.