ఆవిర్భావ సభ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

Mar 10,2025 23:21
ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను

ప్రజాశక్తి – పిఠాపురం

మండలంలోని చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ఎస్‌పి బిందుమాధవ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. సభకు తరలి వచ్చే లక్షలాది కార్యకర్తలు, అభిమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా ట్రాఫిక్‌ మళ్లింపులు, నిర్దేశిత పార్కింగ్‌ స్థలానికి వాహనాలు తేలికగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ చేస్తున్న ఏర్పాట్లను అధికారులకి తెలిపారు. అనంతరం ప్రధాన వేదిక, డి జోన్‌, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ, మీడియా గ్యాలరీ, విఐపి గ్యాలరీలను పరిశీలించారు. సభా ప్రాంగణంలోనూ, హైవే వెంబడి సిసి కెమెరాలు ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌, ఎంపి తంగెళ్ళ ఉదరుశ్రీనివాస్‌, ఎంఎల్‌ఎలు పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్‌, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కళ్యాణం శివ శ్రీనివాస్‌, ఎపి మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చిలకలపూడి పాపారావు, ఎఎస్‌పి మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌, డిఎస్‌పి శ్రీహరిరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️