ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పోర్టు కార్మికులందరూ పాల్గొనాలని సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణలు పోర్టు డిసిఎల్ సుబ్రహ్మణ్యంకు సమ్మె నోటీసు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 20న పోర్టులో ఏ కార్యకలాపాలూ నిర్వహించవద్దని కోరారు. కార్మికులు ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి సమ్మె ప్రదర్శనలో పాల్గొనాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు కార్మిక చట్టాలు మార్పు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్స్ను తీసుకుని వస్తోందని, ఇది ఎంత మాత్రం సహించేది లేదన్నారు. మే 20న సమ్మెను జయప్రదం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం మెడలు వంచి కార్మిక చట్టాలను అమలు చేయించుకుందామన్నారు. రాష్ట్రంలో 14 ఏళ్ల నుంచి కనీస వేతనాల సవరణ చేయకుండా 14 ఏళ్ల క్రితం ధరల ప్రకారం ఉన్న కనీస వేతనాలే నేటికీ అమలవుతున్నాయన్నారు. పెట్టుబడిదారుల లాభాల కోసమే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకుని వచ్చిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటి ఒకటిగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటూ పోతున్నారని దీనివల్ల దేశం ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరతలోకి నెట్టబడుతుందన్నారు. పోర్టులో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్ఐ, బోనస్ సౌకర్యాలు కచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సీపోర్టు, యాంకరేజ్ పోర్ట్, పతంజలి వంటి వాటికి కూడా సమ్మె నోటీసులు అందించారు.
