ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 13న నిర్వహించే యువ ఉత్సవాలలో పాల్గొని యువత తమ ప్రతిభను నిరూపించుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పిలుపుచ్చారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యువజన అధికారి దూలం కిషోర్తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెతికి తీసే లక్ష్యంతో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ యువ ఉత్సవ్ పేరుతో యువతకు వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కాకినాడ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువ ఉత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 13న యానాం రోడ్డు పటవల దగ్గర ఉన్న పైడా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. వివిధ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఇతర వివరాలకు 9000340938 నెంబరులో సంప్రదించాలన్నారు.