ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : గంగమ్మ ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. గంగ జాతర సందర్భంగా ఆలయంలో యాత్రికులకు కల్పించిన ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ ప్రజలతో మాట్లాడి వారికి కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతర కు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ల వద్ద ప్రజల మధ్య తోపులాట జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్లు శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఆలయ ఈ.ఓ. జయకుమార్, ఏసీపీ బాలాజీ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రాజు, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు పాల్గొన్నారు.
