ప్రజాశక్తి – ముద్దనూరు : బీ ముద్దనూరు గ్రామ పంచాయతీలో రోజు ఇంటింటికి తిరిగి తడి,పొడి చెత్తను సేకరించి రోడ్లపై వ్యర్ధాలను తొలగించి శుభ్రంగా ఉంచాలని జమ్మలమడుగు డివిజన్ పంచాయతీ అధికారి తిమ్మక్క సిబ్బందికి సూచించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవిఆర్ఎస్),గ్రామ పంచాయతీ అయిన ముద్దనూరు పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను గురువారం తిమ్మక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిఎల్పీఓ మాట్లాడుతూ రోడ్లపై మురుగు నీరు,చెత్త,చెదారం,వ్యర్ద పదార్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి లక్ష్మి నరసింహులుకు ఆదేశించారు.
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు, దుకాణదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి రోజు ఇంటి వద్దకు వచ్చి తడి, పొడి చెత్త సేకరిస్తున్నారా లేదా అని డిఎల్పీఓ ప్రజలతో ఆరా తీశారు. జాతీయ రహదారిపై పారిశుధ్యం శుభ్రం చేసే విధానంపై క్లాప్ మిత్రులకు అవగాహన కల్పించారు. సేకరించిన చెత్తను చెత్త సంపద తయారీ కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఒ వీరభద్రుడు, సిబ్బంది పాల్గొన్నారు.
