ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : ప్రజా సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కారంపై స్పష్టమైన అవగాహనతో నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లే పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రజా సంఘాలు ఏకతాటి పైకి రావాలని ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రులు నియోకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె.ఎస్ లక్ష్మణరావు కోరారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. పర్యటన భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 న జరిగే ఎన్నికల నేపథ్యంలో 10 వ తేదీన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 2007 లో మండలి పునరుద్ధరణ అనంతరం పిడిఎఫ్ గా ఏర్పడి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు 14 మంది గెలుపొందారని అనేక సమస్యలపై ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందజేసి పరిష్కారానికి కృషి చేశామన్నారు. గత 18 ఏళ్లుగా ప్రజా కార్మిక కర్షక ఉద్యోగుల పక్షాన నిలిచి స్పష్టంగా నిబద్ధతగా, నీతి నిజాయితీతో రాజ్యాంగ విలువలకు, లక్ష్యాలకు కట్టుబడి పని చేశామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, రైతులు,సాగు, త్రాగు నీరు తదితర సమస్యల పరిష్కారానికి మండలిలో తమ గొంతుక వినిపించామని అనేక ఉద్యమాలకు మద్దతు తెలిపామన్నారు. పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఆవశ్యకతను, విద్యారంగం బలోపేతానికి ప్రతిపాదనలపై మండలిలో మాట్లాడామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో ప్రజలకు అనేక ఆశలు కల్పించారని అమలు చేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. 12వ వేతన సంఘం వేస్తారని, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి బకాయిలు ఉన్న రూ. 22 వేల కోట్లలో కొంతమేర అయినా చెల్లిస్తారని ఆశపడి భంగపడ్డారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డి.ఎస్.సి పై చేసి 16,347 పోస్టులు భర్తీ చేస్తామని నవంబర్ 6 లోగా డి.ఎస్.సి ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు అమలు చేయలేదన్నారు. 117 రద్దు చేస్తామని చెబుతూనే కొనసాగిస్తున్నారని ప్రత్యామ్నాయంగా ఇంకొన్ని ప్రతిపాదనలు చేసిందని ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన అవగాహనతో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రశ్నించే పిడిఎఫ్ అభ్యర్థులను మండలికి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గద్దె చలమయ్య, ముజఫర్ అహ్మద్, కట్టా కోటేశ్వరరావు, డి శివకుమారి, ఎస్ ఆంజనేయ నాయక్, సిలార్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.
నీతి, నిజాయితీ, నిబద్ధతకు కేరాఫ్ పిడిఎఫ్ : కె.ఎస్ లక్ష్మణరావు
