మల్టీ పర్పస్ సైకిల్ యూనిట్ పనితీరును పరిశీలిస్తున్న కలెక్టర్
ప్రజాశక్తి – అమలాపురం రూరల్
సృజనాత్మకతతో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ విద్య వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా జిల్లాకు పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ విద్యార్థిని, విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మండల పరిధిలోని వన్నె చింతలపూడి జడ్పి ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మల్టీపర్పస్ మిల్లింగ్ యూనిట్ తయారీ అంశంపై విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను చేసి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయిలలో పోటీలకు చేరుకున్నారని వారినికలెక్టర్ అభినందించారు. ఈ మల్టీపర్పస్ సైక్లింగ్ ద్వారా ధాన్యం మిల్లింగు, విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఈ యూనిట్లో ఉందన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మల్టీ పర్పస్ సైకిల్ యూనిట్ పనితీరును పరిశీలించారు. కోనసీమ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా నేటి పోటీ ప్రపంచంలో జాతీయ స్థాయికి వెళ్లడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి పరిశోధన దిశగా ఆలోచన శక్తిని పెంపొందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి ఉత్తమ ఆవిష్కరణలు చేసేలా పాఠశాల స్థాయి నుంచే ఉపాధ్యాయులు ప్రోత్సహిం చాలన్నారు. సుస్థిరమైన భవిష్యత్తు కోసం శాస్త్రీయ విజ్ఞానాన్ని అలవర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.