అకాల వర్షాలతో రైతులకు ఇక్కట్లు

May 10,2025 17:00
IMG

రోడ్ల వెంబడి తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతులు

ప్రజాశక్తి – రామచంద్రపురం

ప్రతీ రోజు కురుస్తున్న వర్షాలకు రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. అల్పపీడన పభావంతో వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటచేలు నీట మునిగాయి. మరికొన్ని చేలు నేలకొరిగాయి. ఇక నాలుగు రోజుల నుంచి తడుస్తున్న ధాన్యాన్ని రైతులు ఎండబెట్టుకుంటున్నారు. దీంతో రోడ్ల పైన, కల్లాలపైన ఎటు చూసినా తడిసిన ధాన్యాన్ని రైతులు ఎండబెట్టు కొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇదే అదునగా మిల్లర్లు దళారులు కుమ్మక్కై బస్తా రూ.1500 కొనుగోలు చేస్తున్నారు. ఇక తప్పని పరిస్థితిలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని అయిన కాడికి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి లేదు.దళారులు మిల్లర్లు కలిసి కూలి జట్టుతో రైతులు వద్దకు వెళ్లి ధాన్యం తూకం వేసుకొని వాళ్ల వాహనంలో ధాన్యాన్ని మిల్లుకు తరలించి రైతుకు నేరుగా సొమ్ము చెల్లిస్తారు. దీంతో ధర తక్కువైనా రైతులు దళారులకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇక రైతు భరోసా కేంద్రాల్లోనూ, సొసైటీలోనూ అమ్మ తలిస్తే రైతు వెళ్లి సిబ్బందితో మాట్లాడి సంచులు తెచ్చుకుని తానే ధాన్యాన్ని సంచుల్లో నింపుకొని, వాహనాన్ని తెచ్చుకుని దానికి జిపిఎస్‌ చేయించి ఆపై మిల్లుకు తరలించాలి. ఈ తతంగం పూర్తయిన తర్వాత బ్యాంకుకు సొమ్ము కోసం పడిగాపులు పడాలి. దీంతో రైతులు ధర తక్కువైనా దళారులకే ధాన్యాన్ని విక్రయిస్తూ కేవలం రూ.1500 పొందుతున్నారు. ఇక తడిచిన, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించడమే తప్ప అది ఆచరణ సాధ్యం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️