సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న జెసి టి.నిషాంతి
ప్రజాశక్తి – అమలాపురం
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గతంలో ఇచ్చిన రెండు లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్కు అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నులు ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని జెసి టి.నిషాంతి వెల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లా డుతూ ప్రస్తుత రబి సీజన్లో ఆశించిన ఉత్పత్తులలో 34 శాతం మేర అనగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల మాత్ర మే టార్గెట్ ను ప్రభుత్వం నిర్దేశించారన్నారు. ఈనెల ఐదో తేదీన కాకినాడ లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహణ తీరు సమీక్షలో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వారికి జిల్లా యంత్రాంగం మిల్లర్లు టార్గెట్ పెంచాలన్న అభ్యర్థన మేరకు అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆమోదించారని తెలిపారు. ఈ టార్గెట్ లో 40 వేల మెట్రిక్ టన్నులు బాయిల్ రైసు,6 0 వేల మెట్రిక్ టన్నులు రా రైస్ సేకరించాలని లక్ష్యంగా నిర్దే శించారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక లక్ష, 2 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 24 గంటల లోపు ధాన్యం సొమ్ములు రైతు ఖాతాకు జమ చేస్తామన్నారు. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలను కూడా 1:2 గా తగ్గించిందన్నారు. ఉదా హరణకు ఒక రూ.కోటి బ్యాంకు గ్యారంటీ ఇస్తే రూ.2 కోట్ల మేర ప్రభుత్వ పరంగా మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు దృష్టి లో పెట్టుకుని రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రైతులు కూడా వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు తడిసిపోయి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా రైతు సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు సమస్యలు సందేహాలు ఉన్నట్లయితే జిల్లా స్థాయిలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 83094 32487, 94416 92275 సంప్రదించి నివత్తి చేసుకొని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తేమ శాతం 17 గా ఉంటే కనీస గిట్టుబాటు ధరను చెల్లిస్తారని, 18 శాతం ఉంటే ఒక కేజీ, 19 శాతం ఉంటే 2 కేజీలు, 20 శాతం ఉంటే 3 కేజీలు, 21శాతం ఉంటే 4 కేజీలు, 22 శాతం ఉంటే 5 కేజీలు, 22శాతం కన్నా తేమ శాతం ఎక్కువ ఉన్న ఐదు కేజీలు మాత్రమే తరుగులను విధించాలని మిల్లర్లను ఆదేశించామన్నారు. బొండాలు రకానికి బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. రైతు సేవా కేంద్రాల గ్రామ వ్యవ సాయ సహాయకులు ద్వారా ధాన్యం పండించిన రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతోందన్నారు. గతంలో దీపం-1 పథకం కింద ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేదని ప్రస్తుతం దీపం-2 కింద నాలుగు మాసాలకు ఒక సిలిండర్ ను ఉచితంగా అందిస్తోందని ఈ విధంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అందించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు తమ పర్యటనలలో ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. దీపం-2 కింద ప్రస్తుతం రెండవ దశ కొనసాగుతుందని రెండో సిలిండర్ పొందేందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి సేవలు, పిజిఆర్ఎస్ అర్జీలు పరిష్కార నాణ్యత ఉచిత సిలిండర్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాల సంతృప్తి స్థాయిలను ఐవిఆర్ఎస్ పోర్టల్ ద్వారా లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం కోరుతోందని ఆ దిశగా సంతృప్తి స్థాయిలను మెరుగుపరుస్తూ జిల్లాను సంక్షేమ పథకాల అమలులో ముందంజలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎ.ఉదయ భాస్కర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కుమారి ఎం.బాల సరస్వతి, అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.