ప్రజాశక్తి-రామచంద్రపురం గ్రామా పంచాయతీలకు దీటుగా వైసిపి ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయాలు నేటికీ ఉపయోగంలోకి రాని వైనం మండలంలోని తోటపేట గ్రామంలో కనిపిస్తుంది.తోటపేట గ్రామపంచాయతీకి సచివాలయ భవనం మంజూరు కావడంతో అప్పటివరకు ఉన్న గ్రామ పంచయతీ భవనం కూల్చి అద్దె భవనంలో కొంతకాలం కార్యకలాపాలు సాగించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సచివాలయ భవనం, ఆయుష్మాన్ ఆరోగ్య భవనం, పశువుల ఆసుపత్రి, నిర్మాణాలకు రూ.79.30 లక్షలు మంజూరయ్యాయి. వీటితో సచివాలయాన్ని, మిగిలిన భవనాలను నిర్మించారు. 2020 జనవరి 6న వీటి నిర్మాణ పనులు ప్రారంభించారు. సచివాలయ భవనాన్ని మూడేళ్లలో నిర్మించారు. దీనికి మైనర్ పనులు పూర్తి కాలేదు. సచివాలయం చుట్టూ రాళ్లూ రప్పలతో అపరిశుభ్రంగా ఉంది. దీనికి తోడు ప్రహరీ గోడ పూర్తి కాలేదు. ఇప్పటికీ ఆరేళ్లు పూర్తయిన సచివాలయం ప్రారంభానికి నోచుకోలేదు. మొదట్లో కొంతకాలం బిల్లులు ఆలస్యం అయ్యాయని దీంతో నిర్మాణం నత్తనటకగా సాగిందని, రెండేళ్లుగా నిధులు విడుదల కావడంతో పలు గ్రామాల్లోని సచివాలయాలు ప్రారంభించారు. తోటపేటలో మాత్రం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు. రూ.లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని అప్పటి మంత్రి వేణు ప్రారంభిస్తారని పలుమార్లు ఏర్పాట్లు చేసినప్పటికీ పనులు పూర్తిగా కాక పోవడంతో ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఈ సచివాలయం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. రూ.లక్షలతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, సచివాలయంలో మైనర్ పనులు పూర్తిచేసి వెంటనే ప్రారంభించాలని, తోటపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు. కె.గంగవరం మండలంలోని ఎర్ర పోతవరంలోనూ గత ఆరేళ్లుగా సచివాలయం నిర్మాణం కొనసాగినప్పటికీ నేటికీ పూర్తికాలేదు. రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయాలు నేటికీ పూర్తి కాకపోవడంతో పాత గ్రామపంచాయతీ భవనాల్లోనే సచివాలయాల నిర్వహణ కొనసాగుతోంది. అసంపూర్తిగా ఆగిపోయిన సచివాలయ భవనాలను వెంటనే పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు కోరుతున్నారు.
