ప్రజాశక్తి – ఉప్పలగుప్తం, అమలాపురం
అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసిపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. సోమవారం అమలాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాల వైసిపి కో-ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాష్, రైతు నాయకులతో కలిసి ఆయన మండలంలోని భీమన పల్లి పంచాయతీ పరిధిలోని భట్టుపాలెం, వడ్డిచెరువు తదితర ప్రాంతాల్లోని అకాల వర్షంతో పంటలు పాడైన రైతాంగాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భం గా రైతులు ప్రభుత్వ విధానాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతు నాయకుడు యాళ్ళ లక్ష్మీ నారాయణ వివరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. జిల్లాలో ధాన్యం అమ్మ లేక రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. దళారులతో కుమ్మక్కై లక్ష్యాలు పూర్తయ్యాయి అంటూ కొనుగోలు ఆప ివేయడం తగదన్నారు. జిల్లాలో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా ప్రభుత్వం కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు లక్ష్యం పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిగిలిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకోమని ప్రభుత్వం చెప్పకనే పరోక్షంగా చెబుతుందన్నారు. రైతాంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై ఈ నెల 7న రైతులకు అండగా నిలుస్తూ వైసిపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తడిచిన ధాన్యాన్ని గుర్తించి తగిన విధానాల ప్రకారం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకున్న నాయకులు రైతులు పడుతున్న ఇబ్బందులపై కలెక్టర్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెయ్యల రాజ్ కుమార్, అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి నాగేంద్రమణి, సర్పంచ్ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు, వైసిపి నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిన్నూరి వెంకటేశ్వరరావు, వంగా గిరిజకుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, వంటెద్దు వెంకన్న నాయుడు, కుడుపూడి భరత్, గొల్లపల్లి డేవిడ్ రాజు, కాశి బాల మునికుమారి పాల్గొన్నారు.