వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి

Apr 21,2025 23:37
వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలి

ప్రజాశక్తి-రావులపాలెం, రామచంద్రపురంకేంద్రప్రభుత్వం రూపొందించిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని ముస్లిం ఐక్య వేదిక కన్వీనర్‌ షేక్‌ అన్సారీ హెచ్చరించారు. రావులపాలెంలో సోమవారం ముస్లిములు ఆందోళన చేపట్టారు. స్థానిక మసీదు వద్ద నుంచి కోనసీమ ముఖద్వారం, రావులపాడు జంక్షన్‌, అంబేద్కర్‌ నగర్‌, మార్కెట్‌ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, దేశాన్ని పరిరక్షించాలని, వక్ఫ్‌ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్‌, మండల కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తరతరాలుగా దేశ ప్రజల మధ్య ఐఖ్యతను విచ్చినం చేయాలనే బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇటువంటి వాటికి నాంది పలుకడం దురదృష్టం అన్నారు. ఈ ర్యాలీలో మేలుకో ఆంధ్ర సభ్యుడు థామస్‌ పల్లి థానం, కమ్యూనిస్టు నేతలు కొండా దుర్గారావు, ఎంపీజ్‌ కోశాధికారి వలియా, పార సంస్థ సభ్యులు పాల్గొన్నారు. రామచంద్రపురం భారత రాజ్యాంగ ఆర్టికల్‌ 25కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం, వేగాయమ్మపేట, చేదువాడ, కాజులూరు, గొల్లపాలెం, అముజూరు, పసలపూడి, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిములు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ద్రాక్షారామ యానాం సెంటర్‌ నుంచి బయల్దేరి రాజగోపాల్‌ సెంటర్‌కు చేరుకొని అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు.

➡️