శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి-రాజుపాలెం : కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారికి బుధవారం సాయంత్రం ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు శంకుస్థాపన చేశారు. నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం ఆరేళ్లుగా చేస్తున్న కృషికి ఇప్పటికి మోక్షం దక్కిందని ఎంపీ అన్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణంతో అభివృద్ధికి ఊతం, కనెక్టివిటీ, ప్రజల ప్రయాణం సులువు అవుతుందని చెప్పారు. కొండమోడు – పేరేచర్ల రహదారిని కేంద్ర ప్రభుత్వం వద్ద పట్టుబట్టి సాధించామన్నారు. ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్పుచేసి అభివృద్ధి చేయాలని కోరగా కేంద్రం అంగీకరించిందన్నారు. 49.92 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా జాతీయ రహదారి అభివృద్ధి కోసం రూ.881.61 కోట్లతో రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం వద్ద శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.
