ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలోని, వేమవరం గ్రామములో వేంచేసియున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నందు జరుగుతున్న శరన్నవరాత్రుల ఉత్సవాలు శనివారం ముగిశాయి. చివరి రోజు విజయదశమి మహాపర్వదినం సందర్భముగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం ప్రాతఃకాలర్చన, ఉదయం నుండి శ్రీ అమ్మవారికి సహస్రకుంకుమార్చన సమస్త విజయ ప్రాప్తికి శ్రీ లలితా రుద్ర హవనములు మహాపూర్ణాహుతి జరిగినవి. మద్యాహ్నం శ్రీ రాధాకృష్ణ భక్త సమాజం చింతలమాడ , మురళీకృష్ణ భక్త సమాజం తరకటూరు వారిచే భజనా కార్యక్రమాలు జరిగాయి. రాత్రి శ్రీ బాల సరస్వతి నాట్య మండలి చిన్నాపురం వారిచే దేవనర్తకి నాటకం నుండి భవానీ దేవ నర్తకి సీను ప్రదర్శనలు చేశారు. అమ్మవారి దర్శనార్దం కృష్ణా జిల్లా ఏ ఎస్ పి ఎస్ వి డి ప్రసాద్, గుడివాడ డి.ఎస్.పి అబ్ధుల్ సుభాని, మరియు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని బాబూరావులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ మర్యాదలు కార్యనిర్రోహణాధికారి ఆకుల కొండలు సత్కరించారు. ఈ కార్యక్రమములు దిగ్విజయంగా జరుగుటకు తెలుగుదేశం, జనసేన, బి.జె.పి.నాయకులకు, మరియు దేవస్థానం చుట్టుప్రక్కల గ్రామ భక్తులకు, పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక, పంచాయితీ, ఆరోగ్య మరియు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ శరన్నవరాత్రుల ఉత్సవములు అత్యంత వైభంగా జరిగాయని వారికి కొండలరావు ధన్యవాదాలు తెలిపారు.
