ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, నిర్వహణ నిధులు కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు, కార్మిక నేతలపై షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఉన్న జెఎసి శిబిరం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఆర్టీసీ కాంప్లెక్స్, మీదుగా ర్యాలీ సాగి గురజాడ విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖ కార్మిక ప్రజాసంఘాల జెఎసి చైర్మన్ ఎం.జగ్గు నాయుడు (సిఐటియు), వైస్ చైర్మన్లు ఎం.మన్మధరావు (ఎఐటియుసి), భోగవిల్లి నాగభూషణం (ఐఎన్ టియుసి), సిఎస్టియుఐ జాతీయ అధ్యక్షులు ఎన్.కనకారావు, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కె ఎస్ వి కుమార్, ఉపాధ్యక్షురాలు పి.మణి, కార్యదర్శి బి.జగన్, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుతరావు, జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, ఎస్.కె రెహమాన్, పడాల రమణ, తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో కార్మిక – ప్రజా సంఘాలు – జెఎసి ల భారీ ర్యాలీ
