ప్రజాశక్తి -ప్యాపిలి : ఆంధ్రప్రదేశ్ బేవరేజేశ్ కార్పొరేషన్ నంద్యాల గోడౌన్ లో హమాలీ కార్మికులను పనిలోకి తీసుకునేందుకు న్యాయశాఖ మంత్రి ఫరూక్ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి ఇంటర్వ్యూలు జరపకుండా తన అనుయాయులను ఎంపిక చేయడమే దీనికి నిదర్శనం అని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం పట్టణ,మండల అధ్యక్ష కార్యదర్శులు ఎ.వి.భాస్కర్ రెడ్డి, పి.రామాంజనేయులు, నక్కీ శ్రీకాంత్ అన్నారు. దీనికి నిరసనగా జిల్లా కమిటీ పిలుపుమేరకు స్థానిక బేతంచెర్ల సర్కిల్ నందు గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల గోడౌన్లో ప్రస్తుతం 24 మంది కార్మికులు పనిచేస్తున్నారని ప్రస్తుతం వారికి సరిపడా పనులు మాత్రమే అక్కడ ఉన్నాయని అయితే 60 మంది పనిచేయడానికి అవకాశం ఉందని జీవో ఉంది గనుక ఖాళీలు ఉన్న 36 మందిని తీసుకోవడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిఆర్ఓ, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, డి ఎం అండ్ హెచ్ ఓ, గోడౌన్ జనరల్ మేనేజర్ లతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని అయితే నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అనేకమంది నిరుద్యోగులు పని కావాలని అదేవిధంగా ఇప్పటికే పనులు చేస్తూ పనులు కోల్పోయిన హమాలీలు కూడా దాదాపు 170 మంది దాకా అప్లై చేసుకున్నారని అయితే అనూహ్యంగా కేవలం తమ అనుమాయులకు మాత్రమే హమాలీ పని కోసం లక్షల్లో చేతివాటం చూపించి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా తీసుకోవడం సరైంది కాదని వారు అన్నారు. అదీ కాక అదనంగా అంతమంది కార్మికులు పెరిగితే వారికి కనీస కూలీ కూడా గిట్టుబాటు కాదని ఎక్కడైనా కార్మికులకు పని కల్పించాలంటే ఏ మేరకు అవకాశం ఉందో కార్మికులతో చర్చించి అవసరమైన కార్మికులను చేర్పించుకునేందుకు అవకాశం ఉందని అలా కాకుండా జీవోలో 60 మందికి అవకాశం ఉంది కచ్చితంగా ఖాళీగా ఉన్న 36 మందిని తీసుకోవాల్సిందే అన్నట్లుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి మంత్రి ఆయన అనుమాయిలతో చేతివాటం చూపించి పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని దీంట్లో నోటిఫికేషన్ కోసం ఇంటర్వ్యూల కోసం ఏర్పాటు చేసిన కమిటీ లో ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ సెలవులపై వెళ్లిన సమయంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తో సంతకం చేయించారని ఆయన కార్మికుల కష్టాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మంత్రి ఫరూక్ చెప్పాడని నోరు మెదపకుండా సంతకం చేయడం కొసమెరుపని ఇది కార్మికుల పొట్ట కొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలే జరుపకపోతే మిగిలిన అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.స్థానికులకు అవకాశం కల్పించాలని ఒకపక్క అధికారులు చెబుతున్నా స్థానికులుగా ఉన్న వెంకటేశ్వరపురం, ఉడుమాల్పూరం, నంద్యాల ప్రాంత ప్రజలకు అతి తక్కువగా అవకాశం కల్పించడం దుర్మార్గమని ఎవరైతే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి ఉంటారో వారికి మాత్రమే ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ గా పనిలో చేర్పించుకునేందుకు అవకాశం కల్పించారని దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూడాల్సిన న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారే కార్మికులకు అన్యాయం చేయడం సరైనది కాదని ఇప్పటికైనా మంత్రిగారు కార్మికులకు న్యాయం చేయాలని లేనియెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్.ఎ.చిన్న రెహమాన్,ఆవాజ్ నాయకులు రసూల్ తదితరులు పాల్గొన్నారు.
హమాలి కార్మికులను పనిలోకి తీసుకునే విషయంలో న్యాయ శాఖ మంత్రి ఫరూక్ చేతివాటం : సీఐటీయు
