సంక్రాంతికి సొంతూరు బాట పట్టిన విద్యార్థులు, వలస కూలీలు
విద్యాసంస్థలకు సెలవులతో పెరిగిన రద్దీ
ప్రజాశక్తి-విజయనగరంకోట : సంక్రాంతి పండగకు పట్నం నుంచి పల్లెకు జనం క్యూ కడుతున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా లగేజీలతో ఇళ్లకు బయలుదేరారు. మరోవైపు ఉద్యోగులకు సైతం శనివారం నుంచి వరుస సెలవులు కావడంతో స్వగ్రామాలకు క్యూ కడుతున్నారు. ఇంకోవైపు ఉపాధి కోసం హైదరాబాద్, రాజమంద్రి, విజయవాడ, చెన్నై, కోల్కోతా వంటి పట్టణాలకు వలస వెళ్లిన వారంతా మూటాముళ్లతో సొంతూళ్లకు వస్తుండడంతో జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, ఆర్టిసి కాంప్లెక్సు కిట కిటలాడుతున్నాయి. తమ గ్రామాలకు వెళ్లేందుకు వీరంతా ఆర్టీసీ కాంప్లెక్స్కు, రైల్వేస్టేషన్ కు చేరుకోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా చోట్ల రద్దీ నెలకొంది. బస్సులు ఖాళీ లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు సకాలంలో బస్సులు రాకపోవడంతో గంటల తరబడివేచి చూశారు.