ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల హక్కుల కోసం కార్మికులు సమిష్టిగా పోరాటాలకు సంసిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అంజి బాబు పిలుపునిచ్చారు. ఆదోని రెవెన్యూ భవన్లో అఖిలపక్ష సంఘాల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడారు. హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అలా సాధించుకున్న హక్కులను చట్టాలను ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగాలలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిన చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారన్నారు. అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్ల సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయ అన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని దశాబ్ద కాలంగా పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఏఐటీయూసీ నాయకుడు అజరుబాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పేరుతో ప్రభుత్వ రంగాలలో కనీస వేతనం ఇవ్వకుండా వేట్టి చాకిరి చేయించుకుంటున్నారన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు సమస్యల కోసం పోరాడుతున్న పట్టించుకునే వారే లేరన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలు చేసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కార్పొరేటు శక్తుల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలొగ్గి రైతులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. ఈనెల 20న జరిగే సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్ నాయకుడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దేవి శెట్టి ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు కార్యదర్సులు గోపాల్, విరారెడ్డి, దేవా లక్ష్మన్న, లింగన్న, ఈరన్న, లక్ష్మి రెడ్డి, తిప్పన, రామాంజినేయులు, కలుబావి రాజు పాల్గొన్నారు.
