ప్రజాశక్తి మచిలీపట్నం అర్బన్ : కార్మిక వర్గాల ప్రయోజనాల కోసం మే 20వ తేదీ చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి కృషి చేయాలని వివిధ యూనియన్లకు చెందిన నాయకులు ప్రకటించారు. గురువారం మచిలీపట్నం మహాత్మ జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రం బుట్టాయిపేట ప్రాంగణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగర సిఐటియు అధ్యక్షులు బాలసుబ్రమణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు నెలవారి కనీస వేతనం 26 వేల రూపాయలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేసి కార్మిక ప్రయోజన చట్టాలను కొనసాగించాలన్నారు. సిఐటియూ నగర కార్యదర్శి చిరువోలు జయరావు మాట్లాడుతూ కార్మికులకు 8 గంటల పని విధానం కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారీ వర్గాలు కార్మికులతో అదనంగా రెండు మూడు గంటలు పని చేయించుకుని శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు టి చంద్రపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే విధానాలు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి సంస్థలు మనగడకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కోశాధికారి పూస ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారం కోసం 20వ తేదీ దేశవ్యాప్త సమ్మె లో ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ విభాగం వాళ్ళు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారని సమ్మె విజయవంతరానికి బ్యాంకింగ్ యూనియన్ తరపున తమవంతు సహకారం అందిస్తామన్నారు. మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎర్రం శెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఏఐటియుసి నాయకులు ఒంటి పులి లక్ష్మణరావు మాట్లాడుతూ మచిలీపట్నంలో 20వ తేదీ సమ్మె విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య కార్మికులు ఔట్సోర్సింగ్ విభాగం ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మె లో పాల్గొంటారని తెలియజేశారు. మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మదిరి ఫణీంద్ర ఐ ఏన్ టియుసి యూనియన్ నాయకులు షేక్ ఆయుబ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మహమ్మద్ యూనస్, అవనిగడ్డ ధర్మపురి తదితరులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
